అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా.. పోలీస్ అధికారి సహా ఇద్దరు మృతి!

ABN , First Publish Date - 2022-03-09T21:59:22+05:30 IST

అగ్రరాజ్యంలో అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.

అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా.. పోలీస్ అధికారి సహా ఇద్దరు మృతి!

మిస్సోరీ: అగ్రరాజ్యంలో అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిస్సోరీ రాష్ట్రంలోని జాప్లిన్​ నగరంలో మంగళవారం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో జాప్లిన్ పోలీస్ అధికారి సహా ఓ దుండగుడు మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జాప్లిన్ అసిస్టెంట్​ పోలీస్​ చీఫ్​ బ్రియాన్ లూయిస్​ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) నార్త్​పార్క్​ క్రాసింగ్​ షాపింగ్​ సెంటర్‌లోని ఓ స్టోర్​ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది.


దాంతో జాప్లిన్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలో దుండగుడు పోలీసులపై కాల్పులకు తెగపడ్డాడు. దీంతో ఇద్దరు పోలీసు అధికారులకు తూటాలు తగిలాయి. అనంతరం దుండగుడు పోలీస్ వాహనంలో అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. కొద్ది దూరం వెళ్లాక పోలీస్ వాహనాన్ని వదిలేసి పరుగు మొదలెట్టాడు. ఇది గమనించిన పోలీసులు దుండగుడిని వెంబడించారు. సెంట్రల్​ జోప్లిన్​ ప్రాంతంలోకి చేరుకోగానే ఓ అధికారి.. దుండగుడిపై కాల్పులు జరిపారు. దీంతో దుండగుడు కుప్పకూలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.      

Updated Date - 2022-03-09T21:59:22+05:30 IST