మరో Telugudesam సీనియర్ నేత తీవ్ర అసంతృప్తి..!
ABN , First Publish Date - 2021-08-21T18:35:25+05:30 IST
పార్టీకి వెన్నుపోటు పొడిచినవారికి ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమని...
- కష్టపడి పనిచేసేవారికి అవకాశమెక్కడ?
- అనుబంధ కమిటీలపై టీడీపీ నేత ఆర్సీ అసంతృప్తి
చిత్తూరు జిల్లా/తిరుపతి : పార్టీ అనుబంధ విభాగాల్లో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపునిచ్చి, అవకాశం కల్పించాలని టీడీపీ సీనియర్ నేత, మున్సిపల్ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ కోరారు. ఈమేరకు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఇటీవల జరిగిన నియామకాల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచినవారికి ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. పార్టీ అనుబంధ విభాగాలకు కమిటీలను వేసేటప్పుడు స్థానిక నాయకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
కొందరు నాయకుల వెంట తిరుగుతున్న సహాయకులకు కమిటీల్లో కీలక బాధ్యతలు అప్పగించడమంటే, కష్టపడి పనిచేసిన వారిని బాధపెట్టినట్లు అవుతుందన్నారు. 2024లో టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేలా కమిటీలను వేసే నాయకులు వ్యవహరించాలని హితవుపలికారు. ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన వారిని తీసుకొచ్చి కమిటీల్లో కూర్చోబెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా నియామకాలను ప్రక్షాళన చేయాలని డిమాండు చేశారు. లేకుంటే అధికారపార్టీకి పనిచేసినట్టు పూర్తి ఆధారాలతో అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేశారు.