లక్ష గ్రీన్‌ కార్డులు వృథా?.. నష్టపోయేవారిలో సింహభాగం భారతీయులే!

ABN , First Publish Date - 2021-08-07T13:16:30+05:30 IST

అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశం కల్పించే గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై ‘కొవిడ్‌’ నీళ్లు చల్లుతోంది. గ్రీన్‌కార్డుల పరిశీలన, జారీ ప్రక్రియ మహమ్మారి వల్ల నత్తనడకన సాగుతోంది. దీంతో.. ఈ ఆర్థిక సంవత్సరం (గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు) ముగిసేలోగా.. సుమారు లక్ష గ్రీన్‌కార్డులు మురిగిపోయే ప్రమాదాలు...

లక్ష గ్రీన్‌ కార్డులు వృథా?.. నష్టపోయేవారిలో సింహభాగం భారతీయులే!

వలస జీవుల అమెరికా ఆశలపై ‘కొవిడ్‌’ దెబ్బ!

వాషింగ్టన్‌, ఆగస్టు 6: అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశం కల్పించే గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై ‘కొవిడ్‌’ నీళ్లు చల్లుతోంది. గ్రీన్‌కార్డుల పరిశీలన, జారీ ప్రక్రియ మహమ్మారి వల్ల నత్తనడకన సాగుతోంది. దీంతో.. ఈ ఆర్థిక సంవత్సరం (గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు) ముగిసేలోగా.. సుమారు లక్ష గ్రీన్‌కార్డులు మురిగిపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఇలా నష్టపోయేవారిలో సింహభాగం భారతీయులే ఉంటారని అంచనా. వీసాలు, గ్రీన్‌కార్డులను జారీచేసే అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,65,500 గ్రీన్‌కార్డులను జారీ చేస్తామని ప్రకటించింది.


ఏటా జారీ చేసే గ్రీన్‌కార్డుల సంఖ్యతో పోలిస్తే.. ఈ సారి 1.40 లక్షలు అధికంగా జారీ చేస్తామని పేర్కొంది. వచ్చే నెలాఖరుకే ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. ఈ లోగా మరో 1.20 లక్షల దరఖాస్తుల పరిశీలన ముగియాలి. గత నెల విదేశాంగ శాఖ అధికారి చార్లీ ఓపెన్‌హీమ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సెప్టెంబరు చివరికల్లా మరో లక్ష గ్రీన్‌కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండే అవకాశాలున్నాయని విస్పష్టంగా చెప్పారు. దరఖాస్తుదారులకు మరో ఇబ్బంది ఉంది. అవకాశం చేజారిపోతే.. వచ్చే ఏడాది కోటాలో ముందు వరుసలో ఉండరు.


భారత్‌ లాంటి దేశాల వారికి అవకాశం రావాలంటే కనిష్ఠంగా ఐదేళ్లు ఎదురుచూడాల్సిందే. సగటున ఒక గ్రీన్‌కార్డు దరఖాస్తు పరిష్కారానికి పదిన్నర నెలల సమయం పడుతుంది. కొవిడ్‌ మూలంగా యూఎ్‌ససీఐఎ్‌సలో సిబ్బంది కొరత నెలకొంది. లక్ష దాకా గ్రీన్‌కార్డు దరఖాస్తులు మురిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో భారత్‌తోపాటు.. చైనాకు చెందిన పలువురు ఆశావహులు మేరీలాండ్‌ ఫెడరల్‌ కోర్టులో పిటిషన్లు వేశారు. సెప్టెంబరులోగా దరఖాస్తులకు ఆమోదముద్ర పడకుంటే వచ్చే ఏడాది కోటాలో తాము ముందు వరుసలో ఉండేలా యూఎ్‌ససీఐఎ్‌సను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2021-08-07T13:16:30+05:30 IST