2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య: డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2021-03-02T16:23:49+05:30 IST

వినికిడి సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఓ సర్వేను నిర్వహించి ఆసక్తికరమైన విషయాలను

2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: వినికిడి సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఓ సర్వేను నిర్వహించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య ఉంటుందని తేలింది. వినికిడి సమస్య తలెత్తడానికి అంటువ్యాధులు, జన్యుపరమైన లోపాలు, శబ్ద కాలుష్యం, మానవ జీవనశైలిలో వచ్చిన మార్పులే కారణమని వెల్లడించింది. వినికిడి చికిత్స కోసం డబ్ల్యూహెచ్ఓ ప్యాకేజీని కూడా ప్రతిపాదించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి సంవత్సరానికి సగటున 1.33 డాలర్ల(రూ. 97.67) ఖర్చు అవుతుంది. 


ప్రతి సంవత్సరం కొన్ని ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నప్పటికి వినికిడి సమస్యను ఏమాత్రం తగ్గించలేకపోయామని డబ్ల్యూహెచ్ఓ వివరించింది. ప్రస్తుతం ఈ సమస్య ఎదుర్కొంటున్న వారు ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరున్నారని, ఈ సమస్య ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదకరమని తెలిపింది. 2019లో వినికిడి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 160 కోట్లుగా ఉండగా.. రానున్న మూడు దశాబ్దాల్లో ఈ సంఖ్య 250 కోట్లకు చేరుకోనుందని హెచ్చరించింది. ఈ 250 కోట్ల మందిలో 70 కోట్ల మందికి సమస్య తీవ్రంగా ఉంటుందని, వారికి చికిత్స తప్పనిసరి అని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. వినికిడి సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించడంలో ప్రపంచదేశాలు వైఫల్యం చెందుతుండటం వల్ల ప్రతి ఏడాది ట్రిలియన్ డాలర్లు కోల్పోతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ అంచనా వేశారు.

Updated Date - 2021-03-02T16:23:49+05:30 IST