వందలో ఒకటి అక్రమ విద్యుత్‌ కనెక్షనే!

ABN , First Publish Date - 2022-05-25T09:15:15+05:30 IST

దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్సీడీసీఎల్‌) పరిధిలో అక్రమ కనెక్షన్లు భారీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

వందలో ఒకటి అక్రమ విద్యుత్‌ కనెక్షనే!

  • 15 నెలల్లో 2.23 లక్షల కనెక్షన్ల పట్టివేత
  • ఉల్లంఘనుల్లో సంస్థ సీఎండీ కూడా..
  • దక్షిణ డిస్కమ్‌ పరిధిలో విద్యుత్‌ చౌర్యం


హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్సీడీసీఎల్‌) పరిధిలో అక్రమ కనెక్షన్లు భారీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సగటున ప్రతి వంద విద్యుత్‌ కనెక్షన్‌లలో ఒక అక్రమ కనెక్షన్‌ ఉన్నట్టు తేల్చారు. కొందరు బిల్లులు కట్టే స్తోమత లేక అక్రమంగా విద్యుత్‌ను వాడుకుంటుండగా.. మరికొందరు అదే పనిగా విద్యుత్‌ చౌర్యం చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ మేరకు 2021 మార్చి 1వ తేదీ నుంచి 2022 మే 23వరకు దక్షిణ డిస్కమ్‌ పరిధిలో మొత్తం 2,23,603 కేసులను నమోదుచేశారు. ఇందులో భాగంగా రూ.152.35 కోట్ల జరిమానా విధించారు. అయితే అందులో రూ.85.53 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కాగా.. అడ్డదారిలో విద్యుత్‌ను వినియోగించుకున్న వారిలో సాధారణ ప్రజలే కాకుండా.. సాక్షాత్తూ దక్షిణ డిస్కమ్‌ (ఎస్పీడీసీఎల్‌ - హైదరాబాద్‌) సీఎండీ కూడా ఉన్నారు. బంజారాహిల్స్‌ సర్కిల్‌ పరిధిలోని నంది హిల్స్‌ ప్లాట్‌ నెం.159లో సంస్థ సీఎండీకి ఓ స్థలం ఉంది. అందులో నిర్మాణం చేపట్టారు. ఈ మేరకు  కమర్షియల్‌ కనెక్షన్‌ లేదా నిర్మాణం జరిగేంత వరకు తాత్కాలిక కనెక్షన్‌ తీసుకోవాలి.  అలా చేయకుండా డొమెస్టిక్‌ కనెక్షన్‌తోనే నిర్మాణం చేపడుతున్న విషయం విజిలెన్స్‌ విభాగానికి తెలిసింది. 


దీంతో ఎస్సీడీసీఎల్‌ సీఎండీ అడ్డంగా బుక్కయ్యారు. ఆ కనెక్షన్‌ (ఏ9064252)కు జరిమానా కింద రూ.45,350, డెవల్‌పమెంట్‌ చార్జీలకింద మరో రూ.9648 కట్టాలని తాఖీదులు ఇచ్చారు. వాస్తవానికి ఈ కనెక్షన్‌ ఎల్‌టీ1(బీ) డొమెస్టిక్‌ క్యాటగిరిలో ఉంది. దాంతో జరిమానా విధించారనే విషయం నోటీసులు ఇచ్చేదాకా తెలిసే అవకాశం లేదు. అయితే ఆగస్టు 28వ తేదీనే గుట్టుచప్పుడు కాకుండా జరిమానా మొత్తాన్ని సీఎండీ కట్టేశారు. ఇక కనెక్షన్‌లో నమోదైన మొబైల్‌ నంబర్‌ కూడా సీఎండీ అధికారిక నంబర్‌ కావడం గమనార్హం.  విద్యుత్‌ సంస్థలోని తనిఖీ విభాగం.. వినియోగంలో లోటుపాట్లను గుర్తించి, జరిమానాలు విధిస్తోంది. ఇటీవలే సైబరాబాద్‌ పరిధిలోని మణికొండలో 9 కేసులు నమోదు చేశారు. ఓ నిర్మాణ సంస్థ అనధికారికంగా విద్యుత్‌ను వాడుతున్నట్లు గుర్తించి.. రూ.80లక్షల జరిమానా విధించారు. ఆ సంస్థ అప్పటికప్పుడే పెనాల్టీ చెల్లించింది. ఇలా 1,02,173 మంది 100 శాతం జరిమానా చెల్లించారు. 50% జరిమానా చెల్లించినవారు 4,450 మంది ఉన్నారు. ఇక 50 శాతంలోపు జరిమానా చెల్లించినవారు 3,386 మంది ఉన్నారు. జరిమానా అస లు చెల్లించనివారు 1,13,591 మంది ఉన్నారు. ఇవన్నీ  ఎస్పీడీసీఎల్‌ పరిధిలో వెలుగులోకి వచ్చిన లెక్కలు.

Updated Date - 2022-05-25T09:15:15+05:30 IST