కాణిపాకంలోనూ ఒక్కరోజు అన్నదానం
ABN , First Publish Date - 2021-11-30T07:00:59+05:30 IST
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేయన్నుట్లు చైర్మన్ మోహన్రెడ్డి తెలిపారు.
దర్శన టికెట్ల ధరల పెంపునకు సిఫార్సు
వరసిద్ధుడి ఆలయ బోర్డు సభ్యుల తీర్మానం
ఐరాల(కాణిపాకం), నవంబరు 29: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేయన్నుట్లు చైర్మన్ మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం ఆలయ సమావేశ మందిరంలో బోర్డు సమావేశాన్ని నిర్వహించి, 25 అంశాలపై తీర్మానం చేశారు. ఆ వివరాలను చైర్మన్ మీడియాకు తెలిపారు. ‘నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా భక్తులు తమకు నచ్చినంత మందికి అన్నదానం చేయడానికి ఒక్కరోజు అవకాశం కల్పిస్తాం. ఇందుకోసం రూ.1500నుంచి రూ.5000 వరకు చెల్లించవచ్చు. 2011లోని బోర్డు నిర్ణయం మేరకు ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల ధరను పెంచేలా దేవదాయశాఖ ఉన్నతాధికారులకు వినతి పంపడానికి సిఫార్సు చేశాం. గణపతి హోమం ధరను రూ.500 నుంచి రూ.1000 పెంచాం. వినాయక సదన్ బిల్డింగ్పై మూడోఫ్లోర్ నిర్మాణానికి ఆమోదం లభించింది. అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి దేవదాయశాఖకు సిఫార్సు చేయ నున్నాం’ అని చైర్మన్ వివరించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బోర్డు సభ్యులు నరసింహులుశెట్టి, గోవర్దన్, మారుతీశ్వరరావు, కాంతమ్మ, ఏఈవోలు విద్యాసాగర్రెడ్డి, చిట్టెమ్మ, సుధారాణి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.