మరోసారి కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఇంట్లో ఏసీబీ దాడులు
ABN , First Publish Date - 2020-09-25T22:54:53+05:30 IST
మరోసారి కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు నాగరాజుపై మరో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: మరోసారి కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు నాగరాజుపై మరో కేసు నమోదు చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించిన స్థలం విలువ రూ.48.80 కోట్లుగా గుర్తించారు. 16 గుంటల భూమికి ఫేక్ డాక్యుమెంట్స్తో పాస్ బుక్కులు ఇచ్చేందుకు కుట్ర చేసినట్లు గుర్తించారు. ఆర్డీవో వద్ద పెండింగ్లో ఉండగానే నాగరాజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఓ భూవివాద పరిష్కారానికి రూ. 2 కోట్ల లంచం డిమాండ్ చేసి.. రూ. 1.10 కోట్లు తీసుకుంటున్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండల తహసీల్దార్ ఎర్వ బాలరాజు నాగరాజును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కీసర తహసీల్దార్ నాగరాజుకు ముందు నుంచి అవినీతి చరిత్ర ఉంది. ఆయనపై 2011 జూన్లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకున్న కేసు ఉంది. అప్పట్లోనే నాగరాజు ఇంట్లో కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించారు. ఆయన ఇంట్లో విదేశీ మద్యం బాటిళ్లతో ఓ మినీ బార్ ఉండటాన్ని చూసి తెల్లబోయారు. అప్పట్లో ఈ కేసు ఓ సంచలనం. అయితే.. కొందరు పెద్దల అండదండలతో మూడు నెలల క్రితమే నాగరాజు ఆ కేసు నుంచి విముక్తి పొందాడు. ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల్లో అక్రమాస్తుల్ని గుర్తించినా.. క్లీన్చీట్ తీసుకోగలిగాడు.