ఓ వ్యక్తిని తొడపై కాల్చిన Punjab ఎస్సై.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-06-28T20:49:12+05:30 IST

పంజాబ్‌(Punjab)కు చెందిన ఓ ఎస్సై కొందరు వ్యక్తులతో ఘర్షణ, తోపులాటలో సంయమనం కోల్పోయాడు.

ఓ వ్యక్తిని తొడపై కాల్చిన Punjab ఎస్సై.. కారణం ఇదే..

చంఢీగడ్ : పంజాబ్‌(Punjab)కు చెందిన ఓ ఎస్సై(SI) కొందరు వ్యక్తులతో ఘర్షణ, తోపులాటలో సంయమనం కోల్పోయాడు. గొడవకు పాల్పడ్డవారిలో ఓ వ్యక్తిని తుపాకీతో తొడపై కాల్చాడు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో నిందిత ఎస్సైపై సస్పెన్షన్(Suspesion) వేటు పడింది. అతడిపై కేసు కూడా నమోదయ్యిందని ఉన్నతాధికారులు తెలిపారు. పంజాబ్‌లోని మొహాలీ(Mohali) జిల్లా డేరా బస్సీలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ(CCTV)లో  రికార్డవ్వడంతో వీడియో(Video) వైరల్‌(Viral)గా మారింది.


ముబారిక్ పోలీస్ పోస్ట్ వద్ద ఇన్‌‌చార్జీగా డ్యూటీ చేస్తున్న సమయంలో నిందిత ఎస్సై బల్వీందర్ సింగ్(Balvinder singh) ఈ దాడికి పాల్పడ్డాడు. కాల్పులు జరపడానికి ముందు కొంతమంది వ్యక్తులు, ఓ మహిళ అతడితో వాగ్వాదానికి దిగారు. తోపులాట జరుగుతున్న సమయంలో నిందిత ఎస్సై కాల్పులు జరిపినట్టు వీడియోలో కనిపించింది. గాయపడ్డ వ్యక్తిని డెరా బస్సీ సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అక్కడికి సమీపంలోనే ఉన్న చంఢీగడ్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందుతోంది. కాగా ఈ ఘటనపై ఎస్పీ సారధ్యంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. 


ఈ ఘటనపై బాధితుడి సోదరుడు మాట్లాడుతూ.. ‘‘ హెబాత్‌పూర్ రోడ్‌పై నిలుచుని ఉండగా పోలీసులు మా దగ్గరకు వచ్చారు. వాళ్లు నా భార్య బ్యాగుని తనిఖీ చేయాలనుకున్నారు. వాళ్లు(పోలీసులు) తాగివున్నారు. నా సోదరుడిపై కాల్పులు జరిపారు’’ అని వెల్లడించాడు. కొంతమంది వ్యక్తులతో పోలీసులు తొలుత వాదననకు దిగారు. ఆ తర్వాత ఓ మహిళను చెంపదెబ్బకొట్టారు. ఆమె కుటుంబ సభ్యులు ఘర్షణకు దిగడం, ఎస్సై కాల్పులు జరపడం వీడియోలో కనిపించింది.


కాగా ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపినట్టు సస్పెన్షన్‌కు గురయిన ఎస్సై బల్వీందర్ సింగ్ పేర్కొన్నాడు. ఒక వ్యక్తి, అతడి భార్యతోపాటు పలువురు వ్యక్తులు దాడి చేయడంతోనే కాల్పులు జరిపినట్టు చెప్పారు. తనిఖీలు చేయకుండా తనను అడ్డగించారని చెప్పారు. కాగా ఘటనా సమయంలో అక్కడే ఉన్న ఓ పోలిస్‌ స్పందిస్తూ.. ఎస్సై ఖాకీ డ్రెస్‌ని చించివేసేందుకు మహిళ తరపువారు ప్రయత్నించారని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించడంతో ఘర్షణకు దిగారని వివరించారు. కాగా ఢిల్లీ బీజేపీకి చెందిన పలువురు నేతలు ఈ వీడియోని  ట్విటర్‌లో షేర్ చేశారు. పోలీసులే నేరస్థులుగా మారుతున్నారని పంజాబ్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Updated Date - 2022-06-28T20:49:12+05:30 IST