జీహెచ్‌లో ఒమైక్రాన్‌ ప్రత్యేక వార్డు

ABN , First Publish Date - 2021-12-27T14:03:17+05:30 IST

స్థానిక రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీహెచ్‌)లో ‘ఒమైక్రాన్‌’ బాధితులకు చికిత్సలందిం చేందుకు ఏర్పాటైన ప్రత్యేక వార్డును ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికారులతో కలిసి ఆదివారం ఉదయం పరిశీలించారు.

జీహెచ్‌లో ఒమైక్రాన్‌ ప్రత్యేక వార్డు

                              - పరిశీలించిన స్టాలిన్‌


చెన్నై: స్థానిక రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీహెచ్‌)లో ‘ఒమైక్రాన్‌’ బాధితులకు చికిత్సలందిం చేందుకు ఏర్పాటైన ప్రత్యేక వార్డును ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికారులతో కలిసి ఆదివారం ఉదయం పరిశీలించారు. ఈ వార్డులో ఆక్సిజన్‌, అత్యవసర వైద్య పరికరాలు, యంత్రాలు సహా అన్ని సదుపాయాలతో 50 పడకలను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో కరోనా బాధితుల కోసం 2050 పడకలు కలిగిన ప్రత్యేక వార్డు కూడా పనిచేస్తోంది. వీటిలో సగానికి పైగా పడకులు ఖాళీగా ఉన్నాయి. ఆ వార్డులో చికిత్సలు పొందిన కరోనా బాధితులు రోజుకు 50 మందికిపైగా సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జి అవుతున్నారు. ప్రస్తుతం నగరంలోనూ ఒమైక్రాన్‌ కేసులు బయటపడుతుండటంతో వారికి చికిత్సలందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక వార్డును స్టాలిన్‌ పరిశీలించారు. ఆ సందర్భంగా వైద్యనిపుణులకు ఆయన తగు సలహాలు, సూచనలు అందించారు. ఆ తర్వాత ఆయన తేనాంపేటలోని డీఎంఎస్‌ ప్రాంగణంలో పనిచేస్తున్న వైరస్‌ నిరోధక సమాచార సంబంధిత ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. ఆ రూమ్‌లో జిల్లాలవారీగా వైరస్‌ వ్యాప్తి వివరాలను ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ‘ఒమైక్రాన్‌’ కేసులను గురించి ఎప్పటికప్పుడు డాష్‌బోర్డులో ప్రసారమవుతున్న వివరాలను తిలకించారు. ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌ పనితీరును గురించి ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జే రాధాకృష్ణన్‌ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సమగ్రంగా వివరించారు. ఆ ప్రాంగణంలోనే ఉన్న ఆక్సిజెన్‌ సిలిండెర్ల గోదామును, ప్రాణరక్షణ పరికరాలున్న గోదామును, 108 అత్యవసర సేవలందించే అంబులెన్సులను కూడా ఆయన పరిశీలించారు. స్టాలిన్‌తోపాటు మంత్రులు దురైమురుగన్‌, శేఖర్‌బాబు, రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి డీన్‌ డీ. రాజన్‌, వైద్య అధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం తదితరులు పర్యటించారు.

Updated Date - 2021-12-27T14:03:17+05:30 IST