‘ఒమైక్రాన్’ పుట్టుకపై నెదర్ల్యాండ్స్ ప్రభుత్వం సంచలన ప్రకటన
ABN , First Publish Date - 2021-12-01T02:18:27+05:30 IST
దక్షిణాఫ్రికాలో ఒమైక్రాన్ కరోనా వేరియంట్ తొలి కేసు నమోదైనట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించకమునుపే తమ దేశంలో ఆ వైరస్ను గుర్తించామని నెదల్యాండ్స్ ఆరోగ్య శాఖ మంగళవారం సంచలన ప్రకటన చేసింది.
ఆమ్స్టర్డ్యామ్: దక్షిణాఫ్రికాలో ఒమైక్రాన్ కరోనా వేరియంట్ తొలి కేసు నమోదైనట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించకమునుపే తమ దేశంలో ఆ వైరస్ను గుర్తించామని నెదర్ల్యాండ్స్ ఆరోగ్య శాఖ మంగళవారం సంచలన ప్రకటన చేసింది. నవంబర్ 19, 23 తారీఖుల మధ్య సేకరించిన శాంపిళ్లలో ఈ వైరస్ను గుర్తించినట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 24న దక్షిణాఫ్రికా ప్రభుత్వం తొలి ఒమైక్రాన్ కేసు గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..నెదర్ల్యాండ్స్ అధికారులు సేకరించిన శాంపిళ్లు ఆఫ్రికా ఖండం నుంచి తిరిగొచ్చిన ప్రయాణికులవా కాదా అన్న దానిపై మాత్రం స్పషత లేదు. మరోవైపు.. ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై పూర్తి స్పష్టత లేకపోయినప్పటికీ అనేక దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం మొదలెట్టాయి. ముఖ్యంగా ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన ప్రయాణికులపై గట్టి నిఘా పెడుతున్నాయి. అయితే.. నెదర్ల్యాండ్స్ ప్రకటనతో ఒమైక్రాన్ చిక్కుముడి మరింతగా తికమకపెట్టే అవకాశం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.