వామ్మో! ఒమైక్రాన్
ABN , First Publish Date - 2021-12-24T14:32:33+05:30 IST
అనుకున్నంతా అయ్యింది.. విదేశీ ప్రయాణికుల రాక కొంప ముంచుతుందేమోనన్న అనుమానం నిజమైకూర్చుంది.. ఒకే రోజు 33 ఒమైక్రాన్ కేసులు నిర్ధారణ కావడంతో వైద్యశాఖను దడ పుట్టిస్తోంది. ఒకేసారి
- ఒకేరోజు 33 మందికి నిర్ధారణ
- దేశంలోనే మూడో రాష్ట్రంగా రికార్డు
- 4 అంచెల భద్రత మధ్య బాధితులకు చికిత్స
- తొలి బాధితుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
చెన్నై: అనుకున్నంతా అయ్యింది.. విదేశీ ప్రయాణికుల రాక కొంప ముంచుతుందేమోనన్న అనుమానం నిజమైకూర్చుంది.. ఒకే రోజు 33 ఒమైక్రాన్ కేసులు నిర్ధారణ కావడంతో వైద్యశాఖను దడ పుట్టిస్తోంది. ఒకేసారి వచ్చిన కేసులతో దేశంలో అత్యధిక ఒమైక్రాన్ కేసులున్న 3వ రాష్ట్రంగా రికార్డులకెక్కింది. రాష్ట్రంలో మొట్టమొదటి ‘ఒమైక్రాన్’ వైరస్ బాధితుడు చికత్స తర్వాత కోలుకుని తిరుగుముఖం పట్టిన నేపథ్యంలో కొత్తగా 33 ‘ఒమైక్రాన్’ కేసులు బయటపడ్డాయి. వీరిని ప్రత్యేక వార్డులలో చేర్చి, అక్కడ చుట్టుపక్కల పోలీసు కాపలా ఉంచారు. అదే విధంగా ఆస్పత్రి ప్రాంగణాలలో మూడంచెల పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఈ వివరాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. బాధితులను నాలుగంచెల భద్రతా వలయంలో ఉంచి చికిత్సలందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ‘ఒమైక్రాన్’ తాకిడికి గురైన విదేశాల నుంచి, ఆ వైరస్ తాకిడి తక్కువగా ఉన్న దేశాల నుండి ఇప్పటివరకూ లక్షా 9050 మంది వచ్చారని, వారిలో 17 వేల 957 మందికి వైద్యపరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. వీరిలో 111 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయని, వెంటనే వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి తక్షణ చికిత్సలందించినట్లు చెప్పారు. వీరిలో 60 మంది నుంచి సేకరించిన రక్తపునమానాలు, ఇతర శాంపిల్స్ను ప్రయోగశాలలకు పంపగా, బుధవారం రాత్రి ఫలితాలు వెల్లడయ్యాయని, మొత్తం 33 మందికి ‘ఒమైక్రాన్’ సోకినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. దీనితో రాష్ట్రంలో ‘ఒమైక్రాన్’ కేసుల సంఖ్య 34కు పెరిగిందన్నారు. వీరందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని చెప్పారు. తొలిసారిగా ఈ కొత్త వైరస్ బారినపడిన వ్యక్తికి కోలుకుని గురువారం ఇంటికి చేరుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం 33 మందిలో 26 మందిని చెన్నైలో, నలుగురిని మదురైలో, ఇరువురిని తిరువణ్ణామలైలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్సలందిస్తున్నట్లు తెలిపారు. సేలంలో ఒక ‘ఒమైక్రాన్’ బాధితుడికి చికిత్సలందిస్తున్నారని చెప్పారు. చికిత్స పొందుతున్నవారంతా తేలికపాటి సమస్యలతో బాధపడుతున్నారని, తలనొప్పి, గొంతునొప్పి, స్వల్ప జ్వరంతో ఉన్నారని చెప్పారు. వీరంతా త్వరలోనే కోలుకుంటారని నమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త కేసులు బయటపడుతుండటంతో విమానాశ్రయాల్ల్లో నిఘాను పెంచినట్లు చెప్పారు. ఆయా విమానాశ్రయాల్లో కరోనా ముందస్తు వైద్యపరీక్షలను కూడా చేస్తున్నామని చెప్పారు.
వైరస్ వ్యాప్తిలో తృతీయస్థానం
కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’ వ్యాప్తి చెందిన రాష్ట్రాలలో రాష్ట్రం తృతీయ స్థానంలో నిలిచింది. 65 ఒమైక్రాన్ కేసులతో మహారాష్ట్ర ప్రథమస్థానంలో ఉండగా, 64 కేసులతో ఢిల్లీ ద్వితీయ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఒకేరోజు 33 కేసులు బయట పడటంతో ఆ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రంగా తృతీయస్థానానికి చేరుకుంది. ఇదిలా వుండగా ‘ఒమైక్రాన్’ తాకిడికి గురైనవారిలో ఇరువురు మాత్రమే 18 యేళ్ళలోపువారని, తక్కిన వారంతా రెండు విడతల కరోనా నిరోధక టీకాలు వేసుకున్నవారని అధికారులు ప్రకటించారు.
నేడు సీఎం సమీక్ష
రాష్ట్రంలో ఒమైక్రాన్ ముందస్తు నియంత్రణ చర్యలను ముఖ్యమంత్రి స్టాలిన్ శుక్రవారం సమీక్షించనున్నారు. రాష్ట్రంలో గురువారం 33 మందికి ఒమైక్రాన్ లక్షణాలు ఖరారు కావడం, మరికొందరి నమూనాలను పరిశోధన కేంద్రాని కి పంపడం జరిగింది.ఈనేపథ్యంలో, సచివాల యంలో ఉదయం 11గంటలకు ముఖ్య మంత్రి స్టాలిన్ ఒమైక్రాన్ నియంత్రణ చర్యలపై సమీ క్షించనున్నారని, సమావేశంలో ఆరోగ్యశాఖ సహా పలుశాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని ఒక ప్రకటన వెలువడింది.