నైజీరియా నుంచి వచ్చిన వృద్ధుడికి ‘ఒమైక్రాన్’
ABN , First Publish Date - 2021-12-25T13:31:55+05:30 IST
నైజీరియా నుంచి నగరానికి వచ్చిన ఓ వృద్ధుడికి ‘ఒమైక్రాన్’గా తేలింది. అయితే అతనికి మొదటి సారి పరీక్షలో నెగెటివ్ రావడంతో నగరంలోని ఓ హోటల్లో ఐసోలేషన్లో వుంచారు. ఆయనకు నెగెటివే కదా అన్న భరోసాతో
- ఆయనతో సన్నిహితంగా వున్న 91 మందికి పరీక్షలు
- మరిన్ని కేసులు పెరిగే అవకాశం?
- రాష్ట్రంలో 35కి చేరిన ఒమైక్రాన్ కేసులు
చెన్నై: నైజీరియా నుంచి నగరానికి వచ్చిన ఓ వృద్ధుడికి ‘ఒమైక్రాన్’గా తేలింది. అయితే అతనికి మొదటి సారి పరీక్షలో నెగెటివ్ రావడంతో నగరంలోని ఓ హోటల్లో ఐసోలేషన్లో వుంచారు. ఆయనకు నెగెటివే కదా అన్న భరోసాతో సుమారు వందమంది సన్నిహితం గా వ్యవహరించారు. కానీ రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా ఒమైక్రాన్ అని తేలడంతో వారందరికీ పరీక్షలు జరిపిన రాష్ట్ర ఆరోగ్యశాఖ.. ఇందులో ఎన్ని ఒమైక్రాన్ కేసులు వస్తాయోనని ఆందోళనతో ఉంది.. కాగా తాజాగా వచ్చిన మరో కేసుతో రాష్ట్రంలో ఒమైక్రాన్ బాధితుల సంఖ్య 35కి చేరింది.
రాష్ట్రంలో ఇప్పటికే 34 మంది ‘ఒమైక్రాన్’ తాకిడికి గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో ఈ నెల 10న నైజీరియా నుంచి వచ్చిన 61 యేళ్ళ వృద్ధుడికి స్థానిక విమానాశ్రయంలో కరోనా వైద్యపరీక్షలు నిర్వహించారు. అప్పట్లో ఆ వృద్ధుడికి కరోనా లేక పోవడంతో నంగనల్లూరులోని ఓ హోటల్ గదిలో ఐసోలేషన్లో ఉంచారు. వారం రోజుల తర్వాత ఆ వృద్దుడికి ఆరోగ్యశాఖ అధికారులు కరోనా పరీక్షలు చేయగా ‘ఒమైక్రాన్’ నిర్ధారణ అయింది. దీంతో ఆ వృద్ధుడికి సేవలందించిన హోటల్ సిబ్బంది. వారం రోజులపాటు ఆయనతో పాటు సంచరిం చినవారి వివరాలను వెంటనే ఆరోగ్యశాఖ అధికారులు సేకరించారు. ఆ మేరకు అతడితో సన్నిహితంగా వున్న 91 మంది జాబితా రూపొందించి, వారికి వైద్యపరీక్షలు నిర్వహిం చారు. వీరి కదలికలపై ఆరోగ్యశాఖ అధికారులు నిఘా వేస్తున్నారు. ఇక ఒమైక్రాన్ బారినపడిన ఆ వృద్ధుడిని గిండిలోని కింగ్ ఇన్స్టిట్యూట్ ఆస్పత్రికి తరలించి చికిత్సలందిస్తున్నారు. ఈ విషయమై ఆలందూరు జోన్ ఆరోగ్యశాఖ అధికారి సుధ మాట్లాడుతూ... పరీక్షలు చేయించుకున్న వ్యక్తులు బయట సంచరించకుండా తగిన జాగ్రత్త లు తీసుకున్నట్లు వివరించారు.