‘పాత జీతాలే ఇవ్వాలి’
ABN , First Publish Date - 2022-01-29T04:46:23+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వద్దని, జనవరి నెల పాత జీతాలు ఇవ్వాలని మున్సిపల్ హైస్కూల్, నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు లోక్యానాయక్, సురేష్, రామయ్య, నాగరాజు, అనిల్కుమార్ కోరారు.
ఆదోని(అగ్రికల్చర్), జనవరి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వద్దని, జనవరి నెల పాత జీతాలు ఇవ్వాలని మున్సిపల్ హైస్కూల్, నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు లోక్యానాయక్, సురేష్, రామయ్య, నాగరాజు, అనిల్కుమార్ కోరారు. గురువారం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డా.అనుపమను కలిసి పాత జీతాలను మంజూరు చేయాలని వ్యక్తిగత ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదకొండో పీఆర్సీ వేతనం వల్ల జీతాలలో నష్టపోవాల్సి వస్తుదని తిరస్కరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, ఉరుకుందప్ప, జాన్విక్టర్, మారయ్య, గిరి, ప్రసాద్, నాగరాజు, వెంకటేశ్వర్లు, బసవరాజు పాల్గొన్నారు.
కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వద్దని, తమకు రావాలసిన 5 డీఏలతో పాత జీతాలే మంజూరు చేయాలని యూటీఎఫ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సునీల్రాజ్కుమార్, గిరిబాబు అన్నారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదకొండో పీఆర్సీ కొత్త జీతాలను బలవంతంగా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం మంచిది కాదన్నారు.
కోసిగి: ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో పెండింగ్ డీఏలతో కలిపి పాత జీతాలు చెల్లించాలని పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు శుక్రవారం బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తికి వినతి పత్రం అందించారు. అలాగే మెడికల్ ఆఫీసర్ డా. కీర్తిప్రియకు కూడా వైద్య సిబ్బంది వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎర్రిస్వామి, నాగరాజు, సుధాకర్, గురుస్వామి, నూర్జహాన్, నాగమణి, వైద్యసిబ్బంది హనుమంతు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీతో తమకు జీతాలు ఇచ్చేందుకు పూనుకుంటుందని, అయితే తాము జీతాలు తీసుకోవడానికి సిద్ధంగా లేమని, పెండింగ్లో ఉన్న డీఏలతో కలిపి ఈ నెలకు పాత జీతాలే ఇవ్వాలని అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఎమ్మిగనూరు: ఉద్యోగ, ఉపాధాయులకు, పెన్షనర్లకు ఐదు డీఏలను కలిపి పాతజీతాలు చెల్లించాలని పీఆర్సీ సాధన సమితి తాలుక చైర్మన్ మద్దిలేటి, నాయకులు కృష్ణ, ఏపీ వీరన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సబ్ట్రెజరీ కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించి సబ్ట్రెజరర్ రాజుకు వినతిపత్రం ఇచ్చారు.
ఆదోని(అగ్రికల్చర్): పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉపాధ్యాయులకు పాత జీతాలు, ఐదు డీఏలు ఇవ్వాలని శుక్రవారం మండల ఉపాధ్యాయులు ఎంఈవో శివరాములుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గాదిలింగప్ప, భాస్కర్, నారాయణ, నరసింహులు, రాజశేఖర్, నర్సయ్యగౌడ్, నాగరాజురెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ వద్దని పాత జీతాలు ఇవ్వాలని కోరారు.
ఆలూరు: ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలతో కలిపి పాత జీతాలు ఇవ్వాలని తీర్మానం చేసిన ఆప్షన్ పత్రాలను శుక్రవారం పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఎంఆర్సీ సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి నాయకులు కాశీమ్, నాగరాజు, సురేష్, ఉరుకుందు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు. నాయకులు బసవరాజు, రవి, శంకర్, పార్థసారథి, ఈరన్న, ఉరుకుందప్ప, గోవిందప్ప పాల్గొన్నారు.