ప్రాణాలు తీసిన పాతభవనం
ABN , First Publish Date - 2020-11-30T06:44:31+05:30 IST
అనకాపల్లి పాత బస్టాండ్ రోడ్డులో ఉప్పల నీలాద్రిరావుకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ భవనం వుంది. పురాతనమైన ఈ భవనంలో నాలుగు దుకాణాలు వున్నాయి. వీటిల్లో ఒకదానిలో స్థానిక న్యూకాలనీకి చెందిన మాజేటి నూకరాజు (70) ‘గౌరీ స్టీల్ అండ్ టేడర్స్’ పేరుతో దుకాణాన్ని నడుపుతున్నారు.
షాపు యజమానితోపాటు కలాసీ మృతి
పాత బస్టాండ్ రోడ్డులో ఘటన
భవనం ఖాళీ చేయాలని ఏడు నెలల క్రితం
జీవీఎంసీ అధికారులు నోటీసు జారీ
ఒక వ్యాపారి కోర్టును ఆశ్రయించడంతో ఆగిన ప్రక్రియ
పట్టణంలోని ఓ పురాతన భవనం ఇద్దరి ప్రాణాలు తీసింది. ఆదివారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లడానికి దుకాణాన్ని మూసివేయడానికి సన్నద్ధం అవుతుండగా... భవనం శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో షాపు యజమానితోపాటు దానిలో పనిచేస్తున్న కలాసీ మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి పట్టణ సీఐ ఎల్.భాస్కరరావు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
అనకాపల్లిటౌన్, నవంబరు 29:
అనకాపల్లి పాత బస్టాండ్ రోడ్డులో ఉప్పల నీలాద్రిరావుకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ భవనం వుంది. పురాతనమైన ఈ భవనంలో నాలుగు దుకాణాలు వున్నాయి. వీటిల్లో ఒకదానిలో స్థానిక న్యూకాలనీకి చెందిన మాజేటి నూకరాజు (70) ‘గౌరీ స్టీల్ అండ్ టేడర్స్’ పేరుతో దుకాణాన్ని నడుపుతున్నారు. తాకాశివీధికి చెందిన బోయిన రమణ(60) కలాసీగా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో భోజనానికి వెళ్లేందుకు షాపు మూసివేసే ప్రయత్నంలో వున్నారు. ఇంతతో భవనం పైకప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో నూకరాజు, రమణ శిథిలాల కింద చిక్కుకుని మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సహాయ అధికారి మార్టిన్ లూథర్ కింగ్, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని శకలాలను తొలగించారు. నూకరాజు, రమణ మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుం బీకులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. భవనం కూలి, ఇద్దరు మృతిచెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ భాస్కరరావు తెలిపారు.
కోర్టును ఆశ్రయించడంతో ఖాళీ చేయలేదు
పట్టణంలోని పాత బస్టాండ్ రోడ్డులో వున్న పురాతన భవనాన్ని ఖాళీ చేయాలని యజమాని ఉప్పల నీలాద్రిరావుకు ఈ ఏడాది మే నెల 4వ తేదీన నోటీసులు జారీ చేశాం. అయితే షాపుల్లో అద్దెకు ఉంటున్న వారు కోర్టును ఆశ్రయించడంతో యజమాని ఖాళీ చేయించలేకపోయారు. దీంతో భవనాన్ని కూల్చివేయడానికి కూడా అవకాశం లేకపోయింది. పట్టణంలో శిథిలావస్థకు చేరుకుని కాలం తీరిన భవనాలను ఖాళీ చేయించి, అనంతరం వాటిని కూల్చి వేయిస్తాం. - శ్రీరామ్మూర్తి, జోనల్ కమిషనర్, అనకాపల్లి