ఓలా ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్
ABN , First Publish Date - 2022-05-28T06:46:21+05:30 IST
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సెల్స్, విద్యుత్ కార్ల తయారీ రంగంలోకి ప్రవేశిస్తోంది.
రూ.10,000 కోట్ల పెట్టుబడి జూ రేసులో తెలంగాణ
న్యూఢిల్లీ : ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సెల్స్, విద్యుత్ కార్ల తయారీ రంగంలోకి ప్రవేశిస్తోంది. దాదాపు రూ.10,000 కోట్ల పెట్టుబడితో కూడిన ఈ భారీ ప్రాజెక్టు కోసం తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఈ భారీ ప్లాంట్ కోసం కనీసం 1000 ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా. జూన్ నాటికల్లా ఈ ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కంపెనీ నిర్ణయం తీసుకోనుంది. అమెరికాలో టెస్లా కంపెనీ తరహాలో భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో చరిత్ర సృష్టించాలని ఓలా ఎలక్ర్ట్రిక్ భావిస్తోంది.
2-3 ఏళ్లలో ఈవీ కార్లు: వీలైనంత త్వరగా స్థలాన్ని ఎంపిక చేసుకుని రెండు మూడేళ్లలో బ్యాటరీలతో నడిచే కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలని ఓలా ఎలక్ట్రిక్ భావిస్తోంది. తమిళనాడులోని కృష్ణగిరి వద్ద ఓలా ఎలక్ర్టిక్ 500 ఎకరాల్లో ఇప్పటికే విద్యుత్ టూ వీలర్ల ప్లాంట్ ఏర్పాటు చేసి తయారీ చేపట్టింది. ప్రస్తుతం దేశంలో అమ్ముడయ్యే ఈవీ టూవీలర్లలో ఓలా ఎలక్ర్టిక్దే అగ్రస్థానం. ఫోర్ వీలర్ల విషయంలోనూ ఇదే ట్రెండ్ సృష్టించాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం కంపెనీ ఇప్పటికే కొన్ని మోడల్స్ను అభివృద్ధి చేసింది.