ఓటీపీ విషయంలో గొడవ.. నడిరోడ్డుపై టెకీని చంపేసిన Ola Driver
ABN , First Publish Date - 2022-07-06T02:05:45+05:30 IST
ప్రయాణికుల సంఖ్య విషయంలో చెలరేగిన ఘర్షణ ఓ టెకీ హత్యకు కారణమైంది. చెన్నైలో
చెన్నై: ఓటీపీ విషయంలో చెలరేగిన ఘర్షణ ఓ టెకీ హత్యకు కారణమైంది. చెన్నైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుడువన్చెర్రీకి చెందిన 34 ఏళ్ల హెచ్.ఉమేందర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. కోయంబత్తూరులోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉమేందర్ వీకెండ్లో కుటుంబంతో కలిసి చెన్నైలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. భార్యాపిల్లలతో కలిసి ఆదివారం ఓ మాల్లో సినిమా చూశాడు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఉమేందర్ భార్య ఓలా క్యాబ్ బుక్ చేసింది.
క్యాబ్ వచ్చాక అందరూ ఎక్కాక.. ఓటీపీ సరిగా చెప్పలేదంటూ కారు డ్రైవర్ ఎన్.రవి (41) అందరినీ కిందికి దిగాలని సూచించాడు. ఏడుగురు ఉంటే ఎలా అంటూ, ఎస్యూవీ బుక్ చేసుకుని ఉండాల్సిందన్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఉమేందర్ కారు డోర్ను విసురుగా వేశాడు. ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు కారణమైంది. మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన డ్రైవర్ ఉమేందర్పై సెల్ఫోన్ విసిరికొట్టాడు. అంతటితో ఆగక ఉమేందర్పై పిడిగుద్దులు కురిపించాడు. దెబ్బలు తాళలేక అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్పై హత్యనేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.