ఫైళ్ల పరిష్కారంలో జాప్యం.. ‘మహా’ అధికారులకు జరిమానా
ABN , First Publish Date - 2022-03-01T12:04:58+05:30 IST
ఫైళ్ల పరిష్కారంలో జాప్యం.. ‘మహా’ అధికారులకు జరిమానా
- ఒక్కొక్కరికి రూ.10వేలు
హైదరాబాద్ సిటీ : ఉద్యోగ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులకు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ సోమవారం రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. టీఎస్ బీపాస్ చట్టానికి లోబడి ఫైళ్లను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించడంలో సదరు అధికారులు జాప్యం చేసినట్లుగా గుర్తించారు. హెచ్ఎండీఏలో పనిచేస్తున్న ముగ్గురు అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్లు సుధీర్కుమార్, రమేష్చరణ్, వసుంధరలతోపాటు తహసీల్దార్ గజఫర్ హుస్సేన్లున్నారు. వీరి వద్ద పలు అనుమతులకు సంబంధించిన దరఖాస్తులు 16రోజుల నుంచి 27 రోజుల వరకు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై విచారించి ఇలాంటి పరిస్థితులు హెచ్ఎండీఏలో పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో జరిమానా వేయించారు. గతంలో డీపీఎంఎస్ అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంలో అప్పటి కమిషనర్ చిరంజీవులు సైతం దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేసిన పలువురు అధికారులకు జరిమానా వేశారు. తాజాగా మరోసారి జరిమానా వేశారు.