తమ ప్రభుత్వాన్ని కూల్చాలని అధికారులు చూస్తున్నారు : శివసేన

ABN , First Publish Date - 2020-09-21T21:04:21+05:30 IST

సంచలనాలకు మారు పేరుగా నిలిచే శివసేన అధికారిక పత్రిక సామ్నా... మరో మారు అధికారుల వేదికగా సంచలన ఆరోపణలు చేసింది.

తమ ప్రభుత్వాన్ని కూల్చాలని అధికారులు చూస్తున్నారు : శివసేన

ముంబై : సంచలనాలకు మారు పేరుగా నిలిచే శివసేన అధికారిక పత్రిక సామ్నా... మరో మారు అధికారుల వేదికగా సంచలన ఆరోపణలు చేసింది. ప్రభుత్వంలోని కొందరు అధికారులు శివసేన ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అధికారుల్లో కొందరు శత్రువులుగా మారి, బీజేపీతో కుమ్మక్కై, తమ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కుట్రలు పన్నుతున్నారని సామ్నా వేదికగా శివసేన మండిపడింది.


‘‘ఇంకా ఫడణ్‌వీస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని కొందరు అధికారులు భ్రమల్లో ఉన్నారు. ప్రభుత్వంలో కీలక శాఖలతో పాటు, పోలీసు కమిషనర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల లాంటి కీలకమైన వారి అపాయింట్‌మెంట్లను ఆరెస్సెస్ ప్రభావితం చేస్తోంది’’ అంటూ శివసేన పేర్కొంది.


105 మంది ఎమ్మెల్యేల మద్దతున్నా... బీజేపీ అధికారంలోకి రాకపోయిందన్న కడుపు మంట ఆ అధికారుల్లో ఉందని, అంత మెజారిటీ ఉన్నా... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీయే ముందుకు రాలేదని పేర్కొంది. అయితే... తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్న అధికారుల వివరాలు ప్రస్తుతం చెప్పలేమని, కానీ... తమ ప్రభుత్వాన్ని కూల్చాలని మాత్రం కొందరు అధికారులు ఆలోచిస్తున్నారని శివసేన ఆరోపించింది.


ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో కలిసి బీజేపీ నిర్వహించిన ప్రమాణ స్వీకారం కొందరు అధికారుల అంగీకారంతోనే జరిగినట్లు తాము అనుమానిస్తున్నామని, తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాత ప్రభుత్వమే కొనసాగాలని అధికారులు భావిస్తున్నారని సామ్నాలో పేర్కొంది. పాత సీఎం దృష్టిలో బాగుగా అనిపించుకోడానికి స్వతంత్ర ఎమ్మెల్యేలను, చిన్న పార్టీలను కూడా అధికారులు బెదిరించారని ఈ వ్యాసంలో ఆరోపించింది.


బీజేపీ మెజారిటీని నిరూపించే బాధ్యత తమ భుజ స్కంధాలపైనే మోస్తున్నట్లు అధికారుల తీరు ఉందని విమర్శించింది. అధికారుల సహాయంతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎవరైనా భావిస్తే అది వారి మూర్ఖత్వమే అవుతుందని మండిపడింది. ప్రభుత్వంలోని రహస్యాలను కొందరు అధికారులు ప్రతిపక్షాలకు చేరవేస్తున్నారని, ప్రభుత్వంలో ఉన్న వాతావరణాన్ని వారు చెడగొడుతున్నారని శివసేన తీవ్రంగా ధ్వజమెత్తింది. ఈ వ్యవహారంపై హోంశాఖ వెంటనే దృష్టి సారించాలని సామ్నా వేదికగా శివసేన డిమాండ్ చేసింది. 

Updated Date - 2020-09-21T21:04:21+05:30 IST