వరి పైరును పరిశీలించిన శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2022-06-23T03:57:37+05:30 IST

మండలంలోని పెద్దపుత్తేడు పంచాయతీలోని ఉప్పలపాడు గ్రామ రైతులు సాగు చేసిన వరి పైరును ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వినీత, ఏడీఏ పీపీ నర్సోజీ రావు బుధవారం పరిశీలించారు.

వరి పైరును పరిశీలించిన శాస్త్రవేత్తలు
వరి పైరును పరిశీలిస్తున్న శాస్త్రవేత్త, వ్యవసాయశాఖాధికారులు

దగదర్తి, జూన్‌ 22: మండలంలోని పెద్దపుత్తేడు పంచాయతీలోని ఉప్పలపాడు గ్రామ రైతులు సాగు చేసిన వరి పైరును ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వినీత, ఏడీఏ పీపీ నర్సోజీ రావు బుధవారం పరిశీలించారు. వరిలో కలుపు నివారణకు ఓ కంపెనీకి చెందిన మందును పిచికారీ చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆ గ్రామ రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దగదర్తి, అల్లూరు వ్యవసాయశాఖ అధికారులు విజయ్‌ కుమార్‌, లలితలతో కలిసి వారు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఆ కంపెనీ మందు పిచికారి చేసిన వరిపైరులో ఏపుగా పెరిగిన కలుపును గుర్తించారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడారు. కలుపు మందు శాంపిల్స్‌ సేకరించారు. గురువారంలోగా పూర్తి వివరాలతో నివేదికను ఏవో విజయ్‌ కుమార్‌కు అందజేయాలని స్థానిక ఆర్బీకే వీఏఏ విష్ణుప్రియను ఆదేశించారు. అనంతరం ఉప్పలపాడు, చౌటపుత్తేడు, తడకలూరు గ్రామాల్లోని పురుగు మందు దుకాణాలను తనిఖీ చేశారు. సంబంధిత కంపెనీ మందు క్రయవిక్రయాలకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. నష్టానికి సంబంధించి కంన్స్యూమర్‌ కోర్టును ఆశ్రయించనున్నట్లు రైతులు తెలిపారు. 


Updated Date - 2022-06-23T03:57:37+05:30 IST