పంట నష్ట పరిహారం అందేలా చర్యలు : ఏడీఏ
ABN , First Publish Date - 2022-05-16T03:59:25+05:30 IST
తుఫాన్ ప్రభావంతో పంట నష్టం వాటిల్లిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపడుతామని కావలి వ్యవసాయ శాఖ ఏడీఏ కన్నయ్య పేర్కొన్నారు.
దెబ్బతిన్న పంటలు పరిశీలన
కావలి రూరల్, మే 15: తుఫాన్ ప్రభావంతో పంట నష్టం వాటిల్లిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపడుతామని కావలి వ్యవసాయ శాఖ ఏడీఏ కన్నయ్య పేర్కొన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని సర్వాయపాలెం, కట్టకిందపాలెం గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన పంటనష్టాన్ని ఏడీఏ కన్నయ్య, తహసీల్దారు మాధవరెడ్డి, అధికారపార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ కన్నయ్య, తహసీల్దారు మాధవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పంటనష్టంపై సర్వే నిర్వహిస్తామన్నారు. మండలంలో ఇప్పటి వరకు వరి, వేరుశనగ, పత్తి పంటలు 481 హెక్టార్లు (1150 ఎకరాలు) దెబ్బతిన్నట్లు ప్రాఽథమిక అంచనా అన్నారు. వర్షం కారణంగా పంట పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో పూర్తి స్థాయిలో పంటనష్టంపై సర్వే పూర్తవటానికి నాలుగు రోజులు పడుతుందన్నారు. గ్రామాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, వీఆర్వోలు సర్వే చేపడుతున్నారని, సిరిపురం, చలంచర్ల, సర్వాయపాలెం పంచాయతీలల్లో వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలిపారు. సర్వే పూర్తి కాగానే నివేదికలను ఉన్నతాధికారులకు పంపి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జంపాని రాఘవులు, నేతలు సన్పిబోయిన ప్రసాద్, నాయుడు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.