చనిపోయిన టీచరుకు అధికారుల నోటీసులు!
ABN , First Publish Date - 2021-02-28T07:24:24+05:30 IST
ఎన్నికల విధుల్లో ఎందుకు పాల్గొనలేదో తెలపాలంటూ చనిపోయిన ఓ ఉపాధ్యాయుడికి అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేయడం స్థానికంగా చర్చనీయాంశమయ్యింది.
మచిలీపట్నం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో ఎందుకు పాల్గొనలేదో తెలపాలంటూ చనిపోయిన ఓ ఉపాధ్యాయుడికి అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేయడం స్థానికంగా చర్చనీయాంశమయ్యింది. విజయవాడ వన్టౌన్లోని గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో వి.సుబ్బారావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనను పంచాయతీ ఎన్నికల్లో నూజివీడు డివిజన్ రెడ్డిగూడెం మండలంలో ఎన్నికల విధుల్లో నియమించారు. ఆయన ఇటీవలే మరణించడంతో ఎన్నికల విధులకు హాజరుకాలేదు. అయితే ఎన్నికల విధులకు గైర్హాజరయిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కలెక్టర్ ఇంతియాజ్ పేరున ఈనెల 23న షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. ఈ ఘటనపై డీఈవో ఎంవీ రాజ్యలక్ష్మిని వివరణ కోరగా సమాచార లోపం కారణంగా నోటీసు జారీ అయి ఉండవచ్చని చెప్పారు.