కొత్తూరు రిజర్వు ఫారెస్టులో అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2021-08-19T16:57:29+05:30 IST

కొత్తూరు తాడేపల్లి రిజర్వు ఫారెస్టులో..జ

కొత్తూరు రిజర్వు ఫారెస్టులో అధికారుల తనిఖీలు

విజయవాడ: కొత్తూరు తాడేపల్లి రిజర్వు ఫారెస్టులో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలపై అధికార యంత్రాంగం కదిలింది. అటవీ, జలవనరులు, రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కొద్దిరోజులుగా అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరపడంపై ’ఆంధ్రజ్యోతి‘లో ‘తోడేళ్లు‘ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించి అధికారులు పరీశీలనకు వచ్చారు. పి.నైనవరం గ్రామ పరిధిలో కొండ తవ్వకాలు జరిగిన చోట అటవీ శాఖ ఇన్‌చార్జి డీఆర్వో హరగోపాల్‌ పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జలవనరులు, రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లారు. పోలవరం కాల్వ కట్ట పరిధి, కొండ తవ్విన ప్రదేశంపై అధికారులు ఒక స్పష్టతకు రాలేదు. అటవీశాఖ అధికారులు లేకపోవడంతో పరిధిని నిర్ధారించడం కష్టమైంది. త్వరలోనే సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, పోలవరం కాల్వ తవ్వకం ద్వారా వచ్చిన మట్టిని పి.నైనవరంలో 164.700వ కిలోమీటరు వద్ద కొండ పక్కనే డంప్‌ చేశారు. ఆ మట్టిని టెండర్‌ ద్వారా దక్కించుకున్న సంస్థ సీనరేజ్‌ చెల్లించి తరలించేందుకు జలవనరుల శాఖ అనుమతించింది. మట్టిని డంప్‌ చేసిన ప్రదేశాన్ని జలవనరుల శాఖ ఏఈ శిరీష, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సింగ్‌ పరిశీలించారు.


టీడీపీ ఆందోళన

కొత్తూరు రిజర్వు ఫారెస్టులో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరిగిన చోట టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. అక్రమ తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ కొత్తూరు తాడేపల్లి అధ్యక్షుడు బొర్రా పున్నారావు, మాజీ సర్పంచ్‌ కొవ్వూరు రవికుమార్‌, జమలయ్య డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-08-19T16:57:29+05:30 IST