అగ్రిలో అగ్గి

ABN , First Publish Date - 2020-05-23T09:33:43+05:30 IST

వ్యవసాయ శాఖ ఆత్మకూరు సబ్‌ డివిజన్‌లో ఇద్దరు ఉద్యోగుల మధ్య వివాదం తారా స్థాయికి చేరింది

అగ్రిలో అగ్గి

నువ్వెంతంటే నువ్వెంత !

తీవ్రస్థాయికి ఏవో, ఏఈవో వివాదం 

ఇద్దరికీ అధికారి వార్నింగ్‌


నెల్లూరు(వ్యవసాయం), మే 22 : 

వ్యవసాయ శాఖ ఆత్మకూరు సబ్‌ డివిజన్‌లో ఇద్దరు ఉద్యోగుల మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. ఆ డివిజన్‌లోని ఓ మండల వ్యవసాయాధికారి(ఏవో)కి అక్కడే పనిచేస్తున్న ఏఈవోకి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులను రైతులకు అందించే విషయంలో వారి నడుమ స్పర్థలు రేగాయి. అధికారులు ఎంత ప్రయత్నించినా సయోధ్య కుదరలేదు. ఇంతలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఆ మండలానికి ఇన్‌చార్జిగా ఏఈవోని నియమించారు. దీంతో భరోసా కేంద్రాల్లోనే పని చేసుకోవాలని మండల కార్యాలయానికి రావొద్దంటూ ఏవో హుకుం జారీ చేశారు. దీంతో వారి మధ్య మాటా మాట పెరిగి నువ్వెంతంటే నువ్వెంతనే స్థాయికి చేరుకుంది.


వీరి పంచాయితీ ఆ శాఖ జిల్లా కార్యాలయానికి చేరుకుంది. అక్కడి అధికారులు కూడా వారికి ఎంత సేపు కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఇద్దరిలోనూ మార్పు రాలేదు.  అయితే ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో రచ్చ జరిగిందని, స్వయంగా జిల్లా అధికారే చెప్పినా ఏవో, ఏఈవోలు తగ్గలేదని ఓ అధికారి తెలిపారు. చివరికి ఆ ఇద్దరికి వార్నింగ్‌ ఇవ్వడమేకాక, సర్దుకుని పనిచేయకపోతే ఎంక్వైరీ పెట్టిస్తామని హెచ్చరించడంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఏవో, ఏఈవో మధ్య వివాదంపై ఆ మండల ప్రజలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాదు మండలానికి వచ్చే సబ్సిడీ ఎరువుల పంపిణీలో అవకతవకలపైనా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.


వివాదాలకు కేంద్రం

జిల్లాలో వ్యవసాయశాఖకు వివాదాలకు కేంద్రంగా పేరుంది. ముఖ్యంగా అక్కడ కుల చిచ్చు ఎక్కువగా ఉందనేది నమ్మలేని నిజం. ఉన్నత వర్గాల వారు గ్రూపుగా ఏర్పడి పనులు సక్రమంగా చేయడం లేదని, జిల్లా అధికారి పని అప్పగించినా చేయం అని బాహాటంగానే సమాధానమిచ్చే పరిస్థితులు ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. అందుకే జిల్లాలో జేడీ సీటు ఖాళీగా ఉందని, ఇన్‌చార్జులే నెట్టుకొస్తున్నారని తెలిపారు. 

Updated Date - 2020-05-23T09:33:43+05:30 IST