రూ.32 లక్షల కోసం పంతం

ABN , First Publish Date - 2022-08-08T05:55:53+05:30 IST

పాఠశాలల అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం నాడునేడు పథకంలో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది.

రూ.32 లక్షల కోసం పంతం

నాడునేడు నిధులపై కన్నేసిన ఓ అధికారి 

తన జిల్లాలో విద్యాశాఖ కార్యాలయానికి కావాలని పట్టు

నిధుల మళ్లింపు నిబంధనలకు విరుద్ధమని అడ్డుకున్న అధికారిణి

డైరెక్టర్‌ స్థాయిలో తేల్చుకుంటానని కార్యాలయంలోనే హెచ్చరికలు 


గుంటూరు(విద్య), ఆగస్టు 7: పాఠశాలల అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం నాడునేడు పథకంలో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులతో జిల్లా పరిధిలోని పాఠశాలల్లో పనులు చేపట్టాలి. అయితే గుంటూరు జిల్లా నుంచి విభజిత జిల్లాకు ఉద్యోగోన్నతిపై వెళ్లిన ఓ అధికారి ఇక్కడి నిధులపై కన్నేశారు. ఆ నిధులు ఇస్తే బదిలీపై వెళ్లిన జిల్లాలో విద్యాశాఖ కార్యాలయాన్ని నిర్మించుకుంటామని చెప్పారు. అయితే నిధుల మళ్లింపు నిబంధనలకు విరుద్ధమని గుంటూరు జిల్లాకు చెందిన ఓ అధికారిణి అడ్డుకున్నారు. దీంతో ఆ అధికారి అగ్గిమీదగుగ్గిలమై డైరెక్టర్‌ స్థాయిలోనే తేల్చుకుంటానని కార్యాలయంలో బహిరంగంగా అధికారిణిని హెచ్చరించడం ప్రస్తుతం విద్యాశాఖలో చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వివరాలు..  గుంటూరు జిల్లా పరిధిలోని మంగళగిరి నగరపాలక సంస్థలోని రెండు ప్రాథమిక  పాఠశాలలకు ప్రభుత్వం నాడు  నేడు పథకంలో రూ.25 లక్షలు, రూ.7 లక్షలు కేటాయించింది. అయితే రూ.32 లక్షలను నిధులు కొన్ని సాంకేతిక కారణాలతో పాఠశాలలకు వినియోగించలేదు. దీంతో ఇవి ప్రభుత్వ ఖజానాలో ఉండిపోయాయి. ఇటీవల పక్క జిల్లా విద్యాశాఖకు పదోన్నతిపై వెళ్ళిన ఓ కీలక అధికారి ఈ నిధులపై కన్నేశాడు. ఈయన నిధుల మళ్ళింపులో సిద్ధహస్తుడని ప్రచారం. దీంతో తాను వెళ్లిన జిల్లాలో నూతన విద్యాశాఖ కార్యాలయం కట్టిస్తానని, ఇందుకు గుంటూరు జిల్లాలో  వినియోగించకుండా పక్కన పెట్టిన నాడు నేడు నిధుల్ని వినియోగిస్తానని ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర సచివాలయ స్థాయిలో విద్యాశాఖలో పనిచేసే ఓ విశ్రాంత అధికారి, మరో కీలక అధికారి ఆమోదం ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనలను జిల్లాలో విద్యాశాఖను పర్యవేక్షిస్తూ ముక్కుసూటిగా వ్యవహరించే కీలక అధికారిణి వద్దకు ఆయన పంపారు. అయితే ఆమె దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపాదల్ని వెనక్కిపంపడంతోపాటు నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. తన ప్రతిపాదనలను అడ్డుకోవడంతో ఆ అధికారి  మహిళా అధికారితో కార్యాలయంలోనే వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం. మీరు సంతకం పెట్టకుండా.. అనుమతి ఇవ్వనంత మాత్రాన నేను తలపెట్టిన పని ఆగిపోదు.. డైరెక్టర్‌ స్థాయిలో అనుమతి తెచ్చుకుంటానని భీష్మప్రతిజ్ఞ చేసినట్లు సమాచారం.  ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి జిల్లా అత్యున్నత స్థాయి అధికారి వద్దకు చేరడంతో తాత్కలికంగా ఈ ప్రతిపాదనకు బ్రేక్‌ పడింది.


అధికారిణికి ఉపాధ్యాయుల మద్దతు

పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన నిధులు పక్కదారి పట్టకుండా నిలువరించిన మహిళా అధికారికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పరోక్షంగా మద్దతు పలికారు. నిబంధనల ప్రకారం వ్యవహరించి మంచి నిర్ణయం తీసుకున్నారని మంగళగిరికి చెందిన ప్రజాప్రతినిధి,  విద్యాశాఖలోని ఓ అత్యన్నత స్థాయి అధికారి మద్దతుగా నిలిచారు. అవసరం అయితే తాము కూడా ఉన్నతాధికారులతో మాట్లాడతామని  వారు మహిళా అధికారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. 


 

Updated Date - 2022-08-08T05:55:53+05:30 IST