వాసిరెడ్డి పద్మ, అనిత మధ్య తీవ్ర వాగ్వాదం
ABN , First Publish Date - 2022-04-27T18:24:11+05:30 IST
రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అమరావతి: రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా కమిషన్ ఛాంబర్లో వాసిరెడ్డి పద్మ, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జగన్ పాలనలో ఊరికో ఉన్మాది పేరిట రూపొందించిన పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అనిత అందజేశారు. 800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎంతమందికి నోటీసులు ఇచ్చారని నిలదీశారు. పుస్తకాన్ని పరిశీలించి తప్పక సమాధానం ఇస్తానని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
కార్యాలయం వద్ద హైటెన్షన్...
అంతకు ముందుకు మహిళా కమిషన్ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మహిళకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. కాగా అనితతో సహా పలువురు మహిళా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. మహిళలని కూడా చూడకుండా పురుష పోలీసులు దురుసుగా వ్యవహరించారు. మగ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. లోపలకి అనుమతించేదాకా ఇక్కడ నుంచి వెళ్లేది లేదని అనిత తేల్చి చెప్పారు. మహిళా కమీషన్ కార్యాలయంలోకి మహిళలకు అనుమతి లేదా? అని ప్రశ్నించారు. దీంతో మహిళలకు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎండలో దాదాపు 2 గంటల పాటు కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మహిళా కమిషన్ను కలిసేందుకు వంగలపూడి అనితతో పాటు బాధిత కుటుంబ సభ్యులు కార్యాలయానికి వచ్చారు.
పరిమితి సంఖ్యలో తెలుగు మహిళలకు అనుమతి....
చివరకు పరిమితి సంఖ్యలో తెలుగు మహిళలను మహిళా కమిషన్ను కలిసేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో మహిళలు గేటు తోసుకుని కమిషన్ కార్యాలయంలోకి వెళ్లారు. అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులతో కలిసి వాసిరెడ్డి పద్మ చాంబర్ వద్దకు తెలుగు మహిళలు చేరుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులకు తాము కౌన్సిలింగ్ ఇప్పిస్తామన్న మహిళ కమిషన్ కార్యదర్శిపై అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ ఇప్పించేందుకు తాము రాలేదని కార్యదర్శితో అనిత వాగ్వాదానికి దిగారు. అనంతరం మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మను వంగలపూడి అనిత, అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులు కలిశారు.