గంగపుత్రులకు మనస్తాపం

ABN , First Publish Date - 2021-01-21T06:43:29+05:30 IST

గంగపుత్రులను ఉపేక్షించడమేమిటి? పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని ప్రశంసించారు...

గంగపుత్రులకు మనస్తాపం

గంగపుత్రులను ఉపేక్షించడమేమిటి? పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని ప్రశంసించారు. అయితే అదే సందర్భంలో గంగపుత్రులను విస్మరించారు. ఇది, గంగపుత్రులను ఒంటరి వాళ్ళను చేసే కుట్ర గా కనిపిస్తుందనడం సత్య దూరం కాదు. మంత్రి వ్యాఖ్యలు విస్మయపరిచాయి. అవి అనూహ్యమైనవి. అంతేకాదు అపరిపక్వ వ్యాఖ్యలవి. అనుచితంగా మాట్లాడి, ఆ తరువాత క్షమాపణలు చెబితే ప్రయోజనమేమిటి? జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. మంత్రి వ్యాఖ్యలు ప్రమాదకరమైనవి. భిన్న సామాజిక వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే విధంగా అవి ఉన్నాయి. 


మంత్రి వ్యాఖ్యల ఉద్దేశమేమిటో స్పష్టం కావడం లేదు. రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి చేసివుండవచ్చు. గంగపుత్రులను బిసి–-ఎ రిజర్వేషన్ కోటా నుంచి తొలగించేందుకో లేదా ఆ కోటాలో మార్పులు చేసేందుకో ఏదో కుట్ర జరుగు తున్నట్టుగా మంత్రి వ్యాఖ్యలను బట్టి అనుకోవల్సి వస్తుంది. గంగపుత్రులపై తలసాని పరోక్ష విమర్శలు చేశారు. ఇది గర్హనీయం. తన వ్యాఖ్యల ద్వారా గంగపుత్రుల మనో భావాలను ఆయన దెబ్బతీశారు. వారికి తీవ్ర మనస్తాపం కలిగించారు. 


టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు కులం కార్డును ప్రయోగిస్తోంది. ఆ ప్రభుత్వంలో సభ్యుడయిన గౌరవనీయ మంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో విఫలమయ్యారు. మరి ప్రభుత్వం కూడా ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నదా? మంత్రి తలసాని మరోసారి గంగపుత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా ఆయనపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా డిమాండ్ చేస్తున్నాను. చెరువులపై,చేపలపై ప్రథమ హక్కు గంగపుత్రులదేనని స్పష్టంగా ఒక ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, యువ నాయకుడు కేటీఆర్ లకు విజ్ఞప్తి చేస్తున్నాను. 

దెశవెన కిషన్ ప్రసాద్ రావు

రామకృష్ణ కాలనీ విలేజ్ 

తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా

Updated Date - 2021-01-21T06:43:29+05:30 IST