అమరావతి తరలింపుపై మనస్తాపం.. ఆత్మహత్యకు యత్నం..

ABN , First Publish Date - 2020-08-04T02:36:57+05:30 IST

రాజధాని మార్పు తప్పదనుకుని మనస్తాపానికి గురైన ఓ దళిత రైతు ఆత్మహత్యకు యత్నించాడు. పరిపాలన వికేంద్రీకరణ, ఏపీ సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం, ఆ వెనువెంటనే

అమరావతి తరలింపుపై మనస్తాపం.. ఆత్మహత్యకు యత్నం..

అమరావతి : రాజధాని మార్పు తప్పదనుకుని మనస్తాపానికి గురైన ఓ దళిత రైతు ఆత్మహత్యకు యత్నించాడు. పరిపాలన వికేంద్రీకరణ, ఏపీ సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం, ఆ వెనువెంటనే మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం తెలిసిందే. అయితే రాజధాని మార్పుపై పాలకుల నిర్ణయంతో ఉద్దండరాయునిపాలెంకు చెందిన దళిత రైతు పులి పూర్ణ చంద్రరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నేలపాడులోని ఎన్జీవో టవర్స్ పక్కనేగల ఎస్కలేటర్ ఎక్కి పూర్ణ చంద్రరావు ఆత్మహత్యకు యత్నించాడు. భావితరాల భవిష్యత్, రాష్ట్రాభివృద్దితో పాటు తనకు అప్పులు, వడ్డీ సమస్య తీరాలంటే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పూర్ణ చంద్రరావు డిమాండ్ చేశాడు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వైసీపీ ప్రజా ప్రతినిధుల గెలుపునకై తీవ్రంగా శ్రమించి కృషి చేశానని బాధితుడు చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. అధికార పార్టీ నేతల విజయం కోసం సుమారు రూ.15 లక్షలకు పైగా అప్పులు తెచ్చి మరీ ఎన్నికల్లో ఖర్చు చేశానని అన్నాడు. ప్రస్తుతం ఆ డబ్బు వడ్డీతో కలుపుకుని రూ.20 లక్షలకు చేరుకుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమస్యలన్నీ పరిష్కారమవ్వాలంటే, రాజధానిగా అమరావతి ఉంటే తప్ప తన అప్పులు తీరవని కలత చెంది ఆత్మహత్యకు యత్నించానని పూర్ణ చంద్రరావు చెప్పుకొచ్చాడు. అయితే న్యాయపోరాటం ద్వారానే అమరావతిని సాధించేందుకు అవకాశం ఉందని బాధితుడు పూర్ణ చంద్రరావుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి సూచించారు. ఈ సూచనల మేరకు బాధితుడు పూర్ణ చంద్రరావు ఎస్కలేటర్ నుండి దిగొచ్చాడు.

Updated Date - 2020-08-04T02:36:57+05:30 IST