క్వారంటైన్ కేంద్రంలో కళ్యాణం...ఒక్కటైన ప్రేమికులు

ABN , First Publish Date - 2020-05-28T14:40:41+05:30 IST

కరోనా లక్షణాలతో క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ప్రేమికులు అక్కడే కళ్యాణం చేసుకున్న అరుదైన ఘటన...

క్వారంటైన్ కేంద్రంలో కళ్యాణం...ఒక్కటైన ప్రేమికులు

భువనేశ్వర్ (ఒడిశా): కరోనా లక్షణాలతో క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ప్రేమికులు అక్కడే కళ్యాణం చేసుకున్న అరుదైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని సాగాడ గ్రామంలో వెలుగుచూసింది. పూరి జిల్లా సాగాడ గ్రామానికి చెందిన సౌరబ్ దాస్ అనే 19 ఏళ్ల యువకుడు. సౌరబ్ దాస్ అదే గ్రామానికి చెందిన పింకీరాణిని ప్రేమిస్తున్నాడు. సౌరబ్ తన ప్రేయసి పింకీరాణిని తీసుకొని ఈ ఏడాది జనవరిలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి పారిపోయాడు. సౌరబ్ అహ్మదాబాద్ నగరంలోని ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేస్తూ ప్రేయసితో సహజీవనం సాగించాడు.


లాక్ డౌన్ సమయంలో పరిశ్రమ మూసివేయడంతో ప్రేమికుల జంట ఎంతో కష్టనష్టాలు పడి సాగాడ గ్రామానికి తిరిగివచ్చింది. గుజరాత్ నుంచి ఒడిశాకు తిరిగివచ్చిన ప్రేమ జంటకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారికి కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. అయినా ముందుజాగ్రత్తగా వారిని 14 రోజుల పాటు సాగాడ గ్రామంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ప్రేమజంట అహ్మదాబాద్ లో సహజీవనం చేయడంతో పింకీరాణి గర్భం దాల్చింది. దీంతో 14 రోజుల క్వారంటైన్ సమయం ముగిశాక క్వారంటైన్ కేంద్రమే కళ్యాణ వేదికగా ప్రేమజంట సౌరబ్, పింకీరాణిలు పెళ్లి చేసుకున్నారు. వధూవరుల కుటుంబసభ్యులు క్వారంటైన్ కేంద్రంలోకి ప్రవేశించలేనందున ఈ కేంద్రం ఇన్‌చార్జులుగా ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు వధూవరుల తల్లిదండ్రులగా వ్యవహరించారు. సాగాడ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుడు, ఆశా కార్మికుడు, అంగన్ వాడీ వర్కర్లు ఈ ప్రేమజంట వివాహానికి సహాయపడ్డారు. నాడు పారిపోయిన ప్రేమికులు క్వారంటైన్ కేంద్రంలో కళ్యాణం అనంతరం వధూవరులు ఎంచక్కా సొంతింటికి తిరిగివచ్చారు.

Updated Date - 2020-05-28T14:40:41+05:30 IST