దర్జాగా కబ్జా

ABN , First Publish Date - 2021-07-27T05:05:27+05:30 IST

రాజాం నగరం నడిబొడున్డ లక్షలాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. రాజాం మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ కావడంతో ఇక్కడ భూములకు మరింత డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో ఆక్రమణదారులు అధికార పార్టీ నాయకుల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జా చేసేస్తున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. దీంతో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి.

దర్జాగా కబ్జా
రాజాంలో కోర్టు గేటును ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణం

రాజాంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ

అధికార పార్టీ నాయకుల అండతో అక్రమాలు

చోద్యం చూస్తున్న అధికారులు 

రాజాం రూరల్‌, జూలై 26 :  రాజాం నగరం నడిబొడున్డ లక్షలాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. రాజాం మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ కావడంతో ఇక్కడ భూములకు మరింత డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో ఆక్రమణదారులు అధికార పార్టీ నాయకుల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జా చేసేస్తున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. దీంతో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. 


ఆక్రమణలెన్నో.. 

- రాజాం నుంచి డోలపేటకు వెళ్లే రోడ్‌లో జేజే ఇనోటెల్‌ త్రీస్టార్‌ హోటల్‌ను ఆనుకుని ఉన్న సాగునీటి కాలువను ఓ వ్యాపారి ఆక్రమించి బడ్డీ ఏర్పాటు చేశారు. బహిరంగ మార్కెట్‌లో ఈ స్థలం విలువ రూ.40 లక్షలు ఉంటుంది. ఈ దుకాణానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని సైతం ఆక్రమించి గోడ కట్టారు. దీని విలువ కూడా సుమారు రూ.40లక్షలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇది కూడా సాగునీటి కాలువే.

- ఇదే మార్గంలో మరో మూడు సాగునీటి కాలువలు ఉండేవి. ప్రస్తుతం బస్టాండ్‌ నిర్వహిస్తున్న ప్రాంతంలో 43.77 ఎకరాల విస్తీర్ణంలో గుర్రమ్మ, మల్లమ్మ చెరువులుండేవి. వీటి కింద వందల ఎకరాల ఆయకట్టు ఉండేది. కాలక్రమంలో ఆయకట్టు ప్రాంతంలో గృహ నిర్మాణాలు చేపడుతుండడంతో ఆ మూడు కాలువలు సైతం ఆక్రమణదారుల గుప్పెట చేరాయి.

- పశుసంవర్థక శాఖ కార్యాలయం ఆవరణ పూర్తిగా ఆక్రమణకు గురైంది. సుమారు 20 మంది ఆక్రమించి దుకాణాలు పెట్టారు. కొంతమంది బడ్డీలను అద్దెలకు ఇచ్చి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ సొమ్ము చేసుకుంటున్నారు. 

- వ్యవసాయశాఖ కార్యాలయం ఆవరణదీ ఇదే పరిస్థితి.

- సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి గతంలో రెండు మార్గాలు ఉండేవి. వీటిలో మాధవబజార్‌లోని గేటును ఆక్రమించి బడ్డీ ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి దాన్ని నెలకు రూ. 25 వేలకు అద్దెకు ఇచ్చాడు. ఇదే ప్రాంగణంలో మెయిన్‌రోడ్‌ ఆవరణ సైతం ఆక్రమణలకు గురైంది. ఈ ప్రాంగంణంలో దుకాణాలు వెలిశాయి. 

- మెయిన్‌రోడ్‌లోని ఆర్‌అండ్‌బీ కార్యాలయం శిథిలం కావడంతో అక్కడ ఓ వ్యక్తి హోటల్‌ నిర్వహిస్తున్నారు. 

- గతంలో పీహెచ్‌సీగా ఉన్న భవన సముదాయం (ప్రస్తుతం సామాజిక హాస్పిటల్‌) నుంచి బజార్‌లోనికి వెళ్లేందుకు మార్గం ఉండేది. ఈ మార్గాన్ని పట్టణానికి చెందిన ఒకరు  ఆక్రమించి దుకాణం నిర్మించారు.  దీని విలువ సుమారు రూ.50 లక్షల పైమాటే. ప్రస్తుతం నెలకు రూ.20 వేలకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. 


- కోర్టు గేటునూ.. వదలని వైనం

రాజాంలో ఆక్రమణదారులు కోర్టు గేటును కూడా వదలడం లేదు. మాధవబజార్‌లోని కోర్టు గేటును ఆక్రమించి ఆదివారం అర్ధరాత్రి దాటాక దుకాణం పెట్టారు. దీంతో రాజాం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కరకవలస కొండలరావు, కార్యదర్శి శ్రీరాములు ఆధ్వర్యంలో న్యాయవాదులు గురవాన నారాయణరావు, జయదేవ్‌, శాసపు రమేష్‌ కుమార్‌, శ్యాంప్రసాద్‌ తదితరులు రాజాం మునిసిపాలిటీ ఇన్‌చార్జి కమిషనర్‌ ఎం.వి.నాగరాజుకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోరారు. బొబ్బిలి రాజుల హయాంలో నిర్మించిన చారిత్రక కట్టడం ఆక్రమణలకు గురికావడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం స్థలం విలువ సుమారు రూ.50లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో  సైతం ఈ స్థలాన్ని ఓ వ్యాపారి ఆక్రమించడంతో అప్పటి సీనియర్‌ సివిల్‌ జడ్జి నాటి నగర పంచాయతీ కమిషనర్‌ను న్యాయస్థానంలో నిలదీసిన విషయాన్ని న్యాయవాదులు గుర్తు చేశారు. ఈ విషయంపై పొలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా మాధవబజార్‌లోని వ్యాపారులు సైతం కమిషనర్‌ను కలిసి కోర్టు గేటును ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాన్ని తొలగించాలని కోరారు. 

Updated Date - 2021-07-27T05:05:27+05:30 IST