ఓసీ నిర్వాసితులకు మెరుగైన పరిహారం
ABN , First Publish Date - 2022-01-15T05:56:27+05:30 IST
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓపెన్కాస్టు నిర్వాసిత రైతులకు మెరుగైన పరిహారం మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
సీఎం, సీఎస్, సింగరేణి సీఎండీ సహకారంతో ఎకరానికి రూ. 24 లక్షలు
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
రేజర్ల, కొత్తూరు రైతులకు రూ.86.40కోట్ల పంపిణీ
అన్నదాతలతో కలిసి సంక్రాంతి సంబురాలు
సత్తుపల్లి, జనవరి 14 : గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓపెన్కాస్టు నిర్వాసిత రైతులకు మెరుగైన పరిహారం మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఓపెన్ కాస్టు విస్తరణలో భాగంగా భూములు కోల్పోనున్న మండలంలోని రేజర్ల, కొత్తూరు, జీలుగుమిల్లి రైతులకు పరిహారం చెక్కులను శుక్రవారం కొత్తూరు రైతువేదిక వద్ద అదనపు కలెక్టర్ మధుసూదన్తో కలసి అందజేశారు. సుమారు 70ఎకరాలకు మినహా మిగతా 346ఎకరాలకు సంబంధించి ఎకరానికి రూ.24లక్షల చొప్పున రూ.86.40కోట్ల పరిహారం మంజూరైంది. భూమికి ప్రతిఫలంగా డబ్బులు ఇచ్చినా సరిపోదు. కానీ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది జరగకుండా అర్హులకే పరిహారం ఇప్పించామన్నారు. ఇప్పటివరకు సింగరేణి ఓసీ-1లో కొమ్మేపల్లి, లింగపాలెం తదితర ప్రాంతాల్లో కొంతమంది పరిహారం అందక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, చీప్ సెక్రటరీ, సింగరేణి సీఎండీ, కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల సహకారంతో ఎకరానికి రూ.24లక్షలు ఇప్పించినట్లు చెప్పారు. అదేవిధంగా భూమిలో మొక్కలున్నా, కోళ్లఫారాలున్నా, మోటార్లున్నా.. ఏమున్నా సంబంధిత అధికారులను పంపించి ధర ఎంత ఉందో నిర్ణయించి పరిహారంలో జోడిస్తామన్నారు.రైతులపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ చేపడుతున్న ఉద్యమానికి అందరం సంఘీభావం తెలపాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే సండ్రతో పాటు అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ కేవీఎంఏ.మీనన్ను రైతులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, టీఆర్ఎస్ నాయకులు గాదె సత్యం, చల్లగుళ్ల నరసింహారావు, రైతులు చింతల సురేందర్రెడ్డి, భీమిరెడ్డి గోపాల్రెడ్డి, గుర్రాల సురేష్, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి (ఎర్రబాబు), నంద్యాల వెంకటరెడ్డి, మేకా చెన్నారెడ్డి, నరేందర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, ఒగ్గు కేశవరెడ్డి, పెద్దిరెడ్డి పురుషోత్తం, చల్లా రవీందర్రెడ్డి, దేశిరెడ్డి కృష్ణారెడ్డి, మేకా చెన్నారెడ్డి, ఐనంపూడి రవి, శివ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, అధికారులతో కలసి సంక్రాంతి సంబరాలు జరిపిన రైతులు
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు భూములు కోల్పోయిన రైతులకు మెరుగైన పరిహారం లభించేందుకు కృషి చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తమకు సహకరించిన అధికారులను నిర్వాసిత రైతులు సంక్రాంతి పండుగ సందర్బంగా ఘనంగా సన్మానించి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పూలాభిషేకం చేశారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేసి అధికారులు, ప్రజాప్రతినిధులకు గంగిరెద్దులు, మేళతాళాలతో స్వాగడం పలికారు. పరిహారం చెక్కులను అందించిన అనంతరం ఎమ్మెల్యే సండ్రతో పాటు అధికారులను ఘనంగా సన్మానించారు.