గణపతుల శోభాయాత్ర రూట్మ్యాప్ పరిశీలన
ABN , First Publish Date - 2021-09-18T06:25:34+05:30 IST
రేపు(ఆదివారం) గణపతుల నిమజ్జనం సందర్భంగా నగరంలో నిర్వహించనున్న శోభాయాత్ర రూట్ మ్యాప్ను శుక్రవారం కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ పరిశీలించారు.
ఖిల్లా, సెప్టెంబరు 17: రేపు(ఆదివారం) గణపతుల నిమజ్జనం సందర్భంగా నగరంలో నిర్వహించనున్న శోభాయాత్ర రూట్ మ్యాప్ను శుక్రవారం కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. గణపతుల శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు ప్రశాంతం గా ప్రతిమల నిమజ్జం చేసుకోవాలని సూచించారు. చిన్న ప్రతిమలను వినాయకుల బావిలో నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. అదే విధంగా భారీ వినాయక విగ్రహాలను బాసర వద్ద గోదావరి నదిలో నిమజ్జనం చేయాలని నిర్వాహకులకు సూచించారు. జిల్లాలో గణపతి ప్రతిమల నిమజ్జనానికి సుమారు 220పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శోభాయాత్ర దారిలో అన్ని చోట్లా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నిర్వాహకులు అధికారులు, పోలీసు శాఖ సూచనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది రోడ్ల పరిస్థితి బాగుందన్నారు. గణేష్ శోభాయాత్రలో ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ కులమతాలకతీతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. అనంతరం వారు దుబ్బ నుంచి వినాయక్నగర్లో గల వినాయకుల బావి వద్దకు చేరుకొని అవసరమైన చోట అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట విద్యుత్, ఆర్అండ్బీ అధికారులు, సార్వజనిక్ గణేష్మండలి సభ్యులు ఉన్నారు.