జో బైడెన్ కోసం ఒబామా ‘డ్రైవ్ ఇన్’ ర్యాలీ

ABN , First Publish Date - 2020-10-21T12:37:35+05:30 IST

డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కోసం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘డ్రైవ్ ఇన్’ ర్యాలీని నిర్వహించనున్నారు.

జో బైడెన్ కోసం ఒబామా ‘డ్రైవ్ ఇన్’ ర్యాలీ

వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కోసం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘డ్రైవ్ ఇన్’ ర్యాలీని నిర్వహించనున్నారు. బుధవారం పెన్సిల్‌వేనియాలోని ఫిలాడెల్ఫియాలో ఒబామా డ్రైవ్ ఇన్ కార్ ర్యాలీ చేయనున్నట్టు బైడెన్ క్యాంపెయిన్ వెల్లడించింది. అమెరికా ఎన్నికల్లో విజయం సాధించేందుకు కీలక రాష్ట్రాలుగా ఉన్న వాటిలో పెన్సిల్‌వేనియా కూడా ఒకటి. గత ఎన్నికల్లో పెన్సిల్‌వేనియా రాష్ట్రాన్ని రిపబ్లికన్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక ఈ ఎన్నికల్లో జో బైడెన్ కంటే ట్రంప్ వెనుక బడి ఉన్నారు. దీంతో ఈ రాష్ట్రంలో గెలుపు తమదేనన్న దీమాలో డెమొక్రట్లు ఉన్నారు. 


అమెరికా ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. నవంబర్ మూడో తేదీన ఓటు వేయడం కుదరని వారి కోసం ఇప్పటికే ఎర్లీ ఓటింగ్(ఎన్నికల తేదీ కంటే ముందుగానే ఓటు వేయడం) కూడా మొదలైపోయింది. ఈ నేపథ్యంలో 16 లక్షల జనాభా ఉన్న పెన్సిల్‌వేనియా‌లో ఎర్లీ ఓటింగ్‌కు ఓటర్లు సిద్దం కావాలంటూ ఒబామా ప్రచారం చేయనున్నారు. కారులో నుంచే ఒబామా ర్యాలీని నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ముందుగానే ఓటు హక్కును వినియోగించుకోవాలని డెమొక్రట్లు కోరుతున్నారు. ముందుగానే ఓటు వేయడం ద్వారా నవంబర్ మూడో తేదీన క్యూ లేకుండా చూడొచ్చని అంటున్నారు. యూఎస్ ఎలక్షన్స్ ప్రాజెక్ట్ ప్రకారం ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Updated Date - 2020-10-21T12:37:35+05:30 IST