ఎన్వోసీలు పూర్తిగా నిలిపివేశాం: మహమూద్అలీ
ABN , First Publish Date - 2020-03-26T20:14:57+05:30 IST
కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని
హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలందరు లాక్ డౌన్లో స్వచ్ఛంధంగా పాల్గొంటున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులెవరూ సొంత ఊళ్లకు వెళ్లొద్దని సూచించారు. ఎన్వోసీలు పూర్తిగా నిలిపివేశామన్నారు. హాస్టళ్ల నిర్వాహకులకు ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు. హాస్టళ్ల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహమూద్అలీ హెచ్చరించారు.
నిన్న కర్నాటక ముఖ్యమంత్రి ఉగాది సందర్భంగా విద్యార్థులు హాస్టల్స్ నుంచి ఊళ్లకు వెళ్ళమని చెప్పారని, అదే తరహాలో తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఎన్వోసీల కోసం వచ్చారని మహమూద్అలీ చెప్పారు. కొంతమంది విద్యార్థులకు ఎన్వోసీలు ఇచ్చామన్నారు. తర్వాత నిలిపివేశామని చెప్పారు. లాక్ డౌన్ సందర్భంగా అధిక రేట్లతో ప్రజలను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరు పోలీసులకు సహకరించాలని, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని మహమూద్అలీ విజ్ఞప్తి చేశారు.