అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నంబర్ వన్: ఎన్వీ రమణ
ABN , First Publish Date - 2021-12-04T18:34:19+05:30 IST
కృష్ణ పరమాత్మ కౌరవులకు, పాండవులకు మధ్యవర్తిత్వం చేశాడని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. హెచ్ఐసీసీ నోవాటెల్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సదస్సులో ఎన్వీ రమణ పాల్గొన్నారు.
హైదరాబాద్: కృష్ణ పరమాత్మ కౌరవులకు, పాండవులకు మధ్యవర్తిత్వం చేశాడని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. హెచ్ఐసీసీ నోవాటెల్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సదస్సులో ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవరికైనా వ్యక్తి గత జీవితంలో సమస్యలు వస్తే వారిని మనం దూరంగా పెడుతాం. ప్రతిరోజూ సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా మనిషి ఉండడు. బిజినెస్లో సమస్యలు వస్తే కోర్టులకు వస్తారు. 40 సంవత్సారాల అనుభవంతో చెప్తున్నా.. ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలి. అంతర్జాతీయ పారిస్, సింగపూర్, లండన్, హాంగ్కాగ్లలో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఈ సెంటర్ను పెట్టడం చాలా సంతోషం. సింగపూర్, సీజేతో కూడా మాట్లాడాను. వారి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో ఈ సెంటర్ను పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటి కంపెనీల సహకారం కూడా ఎంతో అవసరం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నెంబర్ వన్గా ఉంది. తెలంగాణ ప్రజలు దేన్నైనా స్వాగతిస్తారు. ప్రతి మనిషి జీవితంతో లీగల్ సిస్టం ముడి పడి ఉంటుంది. జూన్లో సీఎం కేసీఆర్తో సెంటర్ గురించి చర్చించినప్పుడు మంచి సహకారం అందించారు. డిసెంబర్ 18న ఆర్బిట్రేషన్ సెంటర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. ఆర్బిట్రేషన్ సెంటర్ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేను’’ అని పేర్కన్నారు.