ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రీ గార్డెన్ పెంపకం చేపట్టాలి
ABN , First Publish Date - 2022-01-19T05:58:27+05:30 IST
సిద్దిపేట జిల్లాలోని శాశ్వత భవనం ఉన్న ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రీ గార్డెన్ పెంపకం చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్ సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్
సిద్దిపేట టౌన్, జనవరి 18: సిద్దిపేట జిల్లాలోని శాశ్వత భవనం ఉన్న ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రీ గార్డెన్ పెంపకం చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్ సూచించారు. మంగళవారం సిద్దిపేటలోని సుభాష్ నగర్, ప్రశాంత్నగర్లోని అంగన్వాడీ కేంద్ర ఆవరణలో జిల్లా శిశుసంక్షేమ శాఖ అధికారి రామ్గోపాల్రెడ్డితో కలిసి న్యూట్రీగార్డెన్ పెంపకాన్ని ప్రారంభించారు. అనంతరం కేంద్రంలోని చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. జిల్లాలో ‘సామ్ టూ మామ్’ ఫిబ్రవరి నెలలోపు పూర్తి చేద్దామని, పిల్లలు ఎదిగే క్రమంలో కావాల్సిన న్యూట్రీ గార్డెనింగ్ పెంపకం ప్రక్రియను రెండు నెలలలోపు పూర్తి చేద్దామని కేంద్రం నిర్వాహకులతో చెప్పారు. సామ్ నుంచి మామ్కు పిల్లల్ని మార్చేలా ఎలాంటి చొరవ తీసుకుంటున్నారని సీడీపీవో, సెక్టోరల్ అధికారులతో ఆరా తీశారు. ముందుగా న్యూట్రీగార్డెన్లో ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు పెట్టారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో రాంగోపాల్ రెడ్డి, ఐసీడీఎస్, సీడీపీవో, సెక్టోరల్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్పై అపోహలు వద్దు
కొండపాక, జనవరి 18: కరోనా టీకాపై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. మంగళవారం సాయంత్రం మండలంలోని ముద్దాపూర్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, జిల్లా ఉప వైద్యాధికారి, స్థానిక నాయకులు ఉన్నారు.