గుండెకు ఆహారం
ABN , First Publish Date - 2021-08-24T05:30:00+05:30 IST
ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా దీర్ఘాయుష్షుతో జీవించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. అయితే గుండె ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆహారం తింటున్నాం? ఏ సమయానికి తింటున్నాం? అనేదీ కీలకమే!..
ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా దీర్ఘాయుష్షుతో జీవించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. అయితే గుండె ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆహారం తింటున్నాం? ఏ సమయానికి తింటున్నాం? అనేదీ కీలకమే!
వీటితో గుండెకు చేటు
భోజనం తదనంతరం స్టార్చ్తో కూడిన చిరుతిళ్లు (బంగాళాదుంప, అరటికాయ చిప్స్) తినడం వల్ల, ముందే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు 50శాతం పెరుగుతాయనీ, గుండె జబ్బులు తలెత్తే అవకాశాలు 45శాతం పెరుగుతాయని ఓ అధ్యయనం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురితమైంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, పప్పుదినుసులతో కూడిన పోషకాహారాలను రోజులోని కొన్ని నిర్దిష్ట సమయాల్లో తినడం వల్ల ఆరోగ్యపరమైన అస్వస్థతలు దరి చేరకుండా ఉంటాయని ఈ అధ్యయనం చెబుతోంది.
ఏ ఆహారం? ఎప్పుడు?
ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకునే ఆహారంలో పాలిష్ పట్టిన ధాన్యం, ఘనరూపంలోని కొవ్వులు, జున్ను, అదనపు చక్కెరలు, మాంసాలతో కూడి పాశ్యాత్య ఆహారపుటలవాట్లు కలిగిన వారు శ్వాసకోశ, గుండె సంబంధ రుగ్మతలతో చనిపోయే అవకాశాలు 44శాతం ఎక్కువ. అలాకాకుండా మధ్యాహ్న భోజనంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పెరుగు, నట్స్ తీసుకునేవారు ఇలాంటి గుండె సంబంధ రుగ్మతలతో చనిపోయే అవకాశాలు 34శాతం తక్కువ. రాత్రి భోజనంలో కూరగాయలు, పప్పుదినుసులు తీసుకునేవారు హృద్రోగాలతో చనిపోయే అవకాశాలు 23శాతం తక్కువ.
సమయమూ కీలకమే!
గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే జీవ గడియారానికి అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం బ్రేక్ఫాస్ట్ తర్వాత పండ్లు తినాలి. మధ్యాహ్న భోజనంలో ప్రాస్డ్ ఫుడ్ మానేయాలి. మాంసం, అదనపు చక్కెరలు, పాలిష్ పట్టిన ధాన్యం తీసుకోకూడదు. బదులుగా పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలి. సాయంత్రం స్నాక్స్గా గుప్పెడు వాల్నట్స్, లేదా ఓ కప్పు పెరుగు, తాజా బెర్రీలు తీసుకోవచ్చు. రాత్రి భోజనంలో వీలైనన్ని కూరగాయలు, పప్పుదినుసులు తీసుకోవాలి.