ఎన్టీఆర్‌ జోలికొస్తె పతనమే

ABN , First Publish Date - 2022-09-22T05:30:00+05:30 IST

ఎన్టీఆర్‌ జోలికొస్తే.. వైసీపీ పతనం ఖాయమని పాణ్యం టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

ఎన్టీఆర్‌ జోలికొస్తె పతనమే
ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పుకు నిరసనగా ఐటీసీ సర్కిల్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన టీడీపీ శ్రేణులు

  1. మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత
  2. హెల్త్‌ యూనివర్సిటీ పేరు వివాదంలో భగ్గుమన్న టీడీపీ  
  3. జాతీయ రహదారిపై నిరసనల హోరు
  4. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

  

కల్లూరు, సెప్టెంబరు 22: ఎన్టీఆర్‌ జోలికొస్తే.. వైసీపీ పతనం ఖాయమని పాణ్యం టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.  హెల్త్‌ వర్శిటీకి ఉన్న ఎన్టీఆర్‌ పేరు తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయంపై గురువారం టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. హైదరాబాద్‌-బెంగూళూరు జాతీయ రహదారిపై ఐటీసీ సర్కిల్‌ వద్ద  మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో చేపట్టారు.  హెల్త్‌ వర్శిటీ పేరు తొలగింపు బిల్లు ప్రతులను దహనం చేశారు.  అనంతరం ఐటీసీ సర్కిల్‌ నుంచి  ర్యాలీగా బయలుదేరి కల్లూరు ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ  సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పేరు తొలగించడం అంటే తెలుగు జాతిని అవమానించడమే అన్నారు.  సీఎం కక్ష పూరితంగా  హెల్త్‌ వర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దుర్మార్గమని అన్నారు.  1986లో  ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన హెల్త్‌ వర్శిటీతో వైఎస్‌కు సంబంధం ఏముందని ప్రశ్నించారు. ఈ నిర్ణయం జగన ఉన్మాదానికి  నిదర్శన మన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారని అన్నారు.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని  ప్రజానీకం చూస్తు ఊరుకోదని, వారి అగ్రహావేశాల్లో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌యాదవ్‌, కల్లూరు మండల కన్వీనర్‌ డి. రామాంజనేయులు, కర్నూలు మార్కెట్‌ యార్డు మాజీ డైరెక్టర్‌ కురపాటి దేవేంద్రారెడ్డి, తిరుమలేష్‌రెడ్డి, ఈవి. రమణ, గంగాధర్‌గౌడ్‌, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, మాదన్న,  ఎస్‌.ఫిరోజ్‌,   శేఖర్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు. 

   పేరు మార్పు పై నిరసన

ఆదోని, సెప్టెంబరు 22: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ   బాలకృష్ణ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం వారు ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. . అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట దహనం  చేశారు. ఈ సందర్భంగా   నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం పట్టణ అధ్యక్షుడు సజ్జాద్‌ హుసేన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.   ఈ కార్యక్రమంలో నందమూరి సీనియర్‌ అభిమానులు శంకర్‌ శాసి్త్ర, మాజీ కౌన్సిలర్లు వెంకటేష్‌, తిమ్మప్ప, దొడ్డనగేరి వీరేంద్ర, కల్లుబావి మల్లికార్జున, మహాదేవప్ప, రాజీవ్‌, విరుపాక్షి పాల్గొన్నారు

 ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరించాల్సిందే

టీడీపీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన 

కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 22: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరించాలని తెలుగు యువత, టీఎనఎస్‌ఎఫ్‌, ఐటీడీపీ  నాయకులు అన్నారు. ఈ సంస్థల ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఆందోళనలో  డా. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ చట్టం 1986ను సవరణ కోసం బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు  ప్రతులను కర్నూలులోని విశ్వేశ్వరయ్య సర్కిల్‌ వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన మాట్లాడుతూ గతంలో  కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడుతున్నట్లు చెప్పిన సీఎం జగన రెడ్డి ఈరోజు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ పేరు మార్చాలని అనుకోవడం దారుణమని అన్నారు. టీఎనఎస్‌ఎఫ్‌ నాయకుడు బజారన్న మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్‌ ఆరోగ్య యూనివర్సిటీగా మార్చాలని రహస్యంగా మంత్రి మండలిలో తీర్మానించి, అసెంబ్లీలో బిల్లును ఆమోదించుకోవడం సిగ్గు చేటు అన్నారు.    ఐటీడీపీ ఇనచార్జి గట్టు తిలక్‌ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం చేసిన  పనులకు  పేర్లు మార్చినంత మాత్రాన  ప్రజాభిమానం పొందలేరని అన్నారు.   ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్‌, టీఎనఎస్‌ఎఫ్‌ పార్లమెంటు అధ్యక్షుడు రామాంజనేయులు, ఐటీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు గట్టు తిలక్‌, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నంద్యాల నాగేంద్ర, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సనా నరసింహులు పాల్గొన్నారు.

 ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన జగన  

 ఓర్వకల్లు, సెప్టెంబరు 22: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడమంటే  ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇనచార్జి గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని హుశేనాపురం బస్టాండు సమీపాన మాజీ జడ్పీ చైర్మన రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పేరును మార్చడంపై ఒకరోజు నిరాహారదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పేరును మార్చి తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరు పెట్టడం దుర్మార్గమన్నారు. మాజీ జడ్పీ చైర్మన రాజశేఖర్‌ మాట్లాడుతూ దేశ విదేశాల్లో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఇలాంటి నిర్ణయం  తీసుకున్న  రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.  ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మహబూబ్‌బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు  మోహన రెడ్డి, మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు రాము, నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, కేవీ మధు, సుధాకర్‌, నాగిరెడ్డి, పార్వతమ్మ, నారాయణ, అల్లాబాబు, బజారు, వేణు, రామాంజినేయులు పాల్గొన్నారు.

  ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి 

పత్తికొండ, సెప్టెంబరు 22: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ పత్తికొండలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. స్థానిక  నాలుగు స్తంభాల  కూడలి వద్ద జరిగిన ఈ ధర్నాను ఉద్దేశించి టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మునినాయుడు మాట్లాడుతూ హెల్త్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేసిన దివంగత నందమూరి తారకరామారావు పేరు మార్చి, దానితో ఏ సంబంధం లేని  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టడం  సబబు కాదన్నారు.  





Updated Date - 2022-09-22T05:30:00+05:30 IST