తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్
ABN , First Publish Date - 2022-05-29T05:59:44+05:30 IST
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని టీడీపీ నాయకులు కొనియాడారు.
జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి
పుట్టపర్తి, మే 28 (ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని టీడీపీ నాయకులు కొనియాడారు. శనివారం నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని ప్రాంతాల్లో కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుకు శ్రీసత్యసాయి జిల్లా నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్లతోపాటు ముఖ్యనాయకులు, రాష్ట్ర, పార్లమెంట్, అనుబంధ సంఘాల కమిటీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ శతజయంతిలో పాల్గొన్నారు. పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఒంగోలు సమీపంలో ఈతముక్కలపల్లి వద్ద ఎన్టీఆర్ శతజయంతిలో పాల్గొని నివాళులర్పించారు. మాజీ మంత్రి పరిటాల సునీత హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా అద్దంకి సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పరిటాల శ్రీరామ్, కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్నలు ఒంగోలు మహానాడు వద్ద నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సవిత పూల మాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఒంగోలులో టీడీపీ రాష్ట్ర వడ్డెర సాధికార సమితి కన్వీనర్ వడ్డె వెంకట్ ఆధ్యర్యంలో రాయలసీమ జిల్లాల వడ్డెర సంఘం నాయకులు, అభిమానుల మధ్య కేట్కట్ చేశారు.