ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. న్యూజెర్సీలో ఘనంగా రెండవ మహానాడు!

ABN , First Publish Date - 2022-06-27T02:31:04+05:30 IST

న్యూజెర్సీ నగరంలో(అమెరికా) టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండవ మహానాడు ఘనంగా జరిగింది.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. న్యూజెర్సీలో ఘనంగా రెండవ మహానాడు!

ఎన్నారై డెస్క్: న్యూజెర్సీ నగరంలో(అమెరికా) టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండవ మహానాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నారై యూఎస్ఏ కోఆర్డినేటర్  కోమటి జయరాం అధ్యక్షత వహించారు. శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ రంగస్థల నటులు, నాటక అకాడమీ మాజీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ప్రతినిధుల నమోదు కార్యక్రమం అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కీ.శే. అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 


ఈ సందర్భంగా టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ..టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావటానికి ప్రవాసాంధ్రులు కీలక భూమిక పోషించాలన్నారు. ప్రచార సాధనాల్లో భాగమైన సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సాధనాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలన్నారు. అసమర్థ, అవినీతిమయ, నిరంకుశ పరిపాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమైపోయిందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అందరూ కార్యోన్ముఖులు కావాలన్నారు. అమెరికాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో జయరాం కోమటి విశేష కృషి చేస్తున్నారన్నారు. పార్టీని మరింత పటిష్ట పరుస్తూ 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 


శాసనసభ మాజీ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలలో జయాపజయాలు రాత్రి, పగలు వంటివన్నారు. అవి ఒక దాని వెంట ఒకటి వస్తుంటాయని చెప్పారు. దుష్టశక్తుల గ్రహణం తొలగి తెలుగుదేశం దశదిశలా వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రజాబలంతో రాజకీయ కుట్రలు, మానసిక దాడులు తట్టుకుని నిలబడింది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు. ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆధునిక రాష్ట్రంగా అగ్రభాగాన నిలబడటానికి కారణం తెలుగుదేశం వేసిన బలమైన పునాదులేనని స్పష్టం చేశారు. ఆ పునాదులను కదలకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. 


బోస్టన్ మహానాడు-అభినందనలు,  ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి, అరాచక ఆంధ్రప్రదేశ్-కక్ష సాధింపు చర్యలు, అభివృద్ధి కావాలి-చంద్రబాబు రావాలి, పార్టీ నిర్మాణం-సభ్యత్వ నమోదు తీర్మానాలను గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు సభలో ప్రవేశపెట్టారు. సభ్యులందరూ చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. చివరగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ప్రముఖ రంగస్థల నటులు, నాటక అకాడమీ మాజీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై సభ్యులు రాధాకృష్ణ నల్లమల, విద్యా గారపాటి, శ్రీరాం ఆలోకం, రమేశ్ నూతలపాటి, రవి పొట్లూరి, భాను మాగులూరి, శ్రీనివాస్ యెండ్లూరి, గర్నె వెంకట రమణ, రామకృష్ణ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-27T02:31:04+05:30 IST