TDP: తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బాడ్మింటన్ టోర్నమెంట్
ABN , First Publish Date - 2022-09-28T18:48:04+05:30 IST
తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బాడ్మింటన్ టోర్నమెంట్ 2022 సెప్టెంబర్ 24 తేదీన విజయవంతంగా జరిగింది.
సిడ్నీ: తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బాడ్మింటన్ టోర్నమెంట్ 2022 సెప్టెంబర్ 24 తేదీన విజయవంతంగా జరిగింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు, కార్తీకమాసం వనభోజనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో సిడ్నీలోని తెలుగువారిని ఒక వేదిక మీదకు తెస్తున్న తెలుగుదేశం ఆస్ట్రేలియా ఈసారి తెలుగు క్రీడా ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా తెలుగువారు గర్వించే మహనీయుడు ఎన్టీఆర్ పేరున బాడ్మింటన్ పోటీలను సిడ్నీ స్పోర్ట్స్ క్లబ్ నందు నిర్వహించింది. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగిన ఈ పోటీల్లో 130 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
పురుషుల డబుల్స్లో శశాంక్ రెడ్డి-శేషగిరిరావుల జట్టు విజేతగా నిలిస్తే.. అజయ్ కుమార్-సుధీర్ల జట్టు రన్నరప్గా నిలిచింది. ఇక మహిళల డబుల్స్ విభాగంలో వినీల-యామిని సాయిశ్రీల జట్టు విజేతగా, సాత్విక-సురేఖల జట్టు రన్నరప్గా నిలిచారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వినీల-నవీన్ కుమార్ల జోడీ విజేతగా, కల్పన-కపిల్ల జోడీ రన్నరప్గా నిలిచింది. వీరికి స్పాన్సర్ల చేతుల మీదుగా ట్రోఫీలతో పాటు నగదు బహుమతిని అందజేశారు. ప్రత్యేకంగా తెలుగువారి కోసం ఇటువంటి పోటీలు జరపటం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం ఆస్ట్రేలియాను అభినందించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రతినిధులు మాట్లాడుతూ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన స్పాన్సర్లు, క్రీడాకారులు, వాలంటీర్లకు కృతఙ్ఞతలు తెలియజేశారు. సిడ్నీలోని తెలుగువారందరిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చే మరిన్ని కార్యక్రమాలు తెలుగుదేశం ఆస్ట్రేలియా చేపడుతుందని, అందరూ కుటుంబసమేతంగా పాల్గొని ఆనందించాలని కోరారు.