`బే ఏరియా`లో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి – 3వ మినీ మ‌హానాడు!

ABN , First Publish Date - 2022-08-01T21:20:31+05:30 IST

`బే ఏరియా`లో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి – 3వ మినీ మ‌హానాడు!

`బే ఏరియా`లో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి – 3వ మినీ మ‌హానాడు!

జ‌య‌రాం కోమ‌టి ఆధ్వ‌ర్యంలో విజయవంతం!!

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ద‌శ దిశ‌లా వ్యాపింప‌జేసిన‌, ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు దేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడలు నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త జయంతి సంవ‌త్స‌రం ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఈ ఏడాది మే నెల‌లో జ‌రిగిన‌ మ‌హానాడు వేదిక‌గా, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఎన్టీఆర్‌ శ‌త జయంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా ప్రారంభించారు. రాష్ట్రంలోనే కాకుండా తెలుగు వారు ఎక్క‌డున్నా ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని చంద్రబాబు పిలుపునిచ్చారు.


ఈ క్ర‌మంలో అగ్రరాజ్యం అమెరికాలోని తెలుగు దేశం పార్టీ నాయ‌కులు, తెలుగు భాషాభిమానులు, తెలుగువారు కూడా ఎన్టీఆర్ శ‌త‌ జయంతిని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. అమెరికాలోని తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ జ‌య‌రాం కోమ‌టి ఆధ‌ర్యంలో ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. మొత్తం 12 న‌గ‌రాల్లో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతిని పుర‌స్క‌రించుకుని మినీ మ‌హానాడులు నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం ఏడాది పాటు నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మాల‌ను నెల‌కు ఒక న‌గ‌రంలో నిర్వ‌హించేలా ప్ర‌ణాళిక సిద్ధం చేసారు.


మేలో ఇప్ప‌టికే బోస్ట‌న్ న‌గ‌రంలో మ‌హానాడును నిర్వ‌హించారు. గ‌త జూన్ మాసంలో న్యూ జెర్సీలోను మినీ మ‌హానాడును ఘ‌నంగా నిర్వ‌హించారు. జూలై నెల‌కు సంబంధించి ఈ రోజు బే ఏరియా, కాలిఫోర్నియాల‌లో మినీ మ‌హానాడును ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆగ‌స్టు మాసంలో డెట్రాట్ ప్రాంతంలో టీడీపీ మినీ మ‌హానాడును నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.


బే ఏరియాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 3వ మినీ మహానాడు కార్యక్రమానికి జయరాం కోమటి అధ్యక్షత వహించారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆన్‌లైన్‌లో ప్రసగించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించడం జరిగింది.


ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు అనేక సందర్భాల్లో బాగా స్పందించారు. రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారు. మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు వయస్సును కూడా లెక్కచేయకుండా తక్షణమే స్పందించి వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తెలుగుదేశం పార్టీ బాధితులకు సహాయం అందించడం అభినందనీయం’’ అని తెలిపారు. 


గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ..‘‘మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉంటే పరిశ్రమలు, కంపెనీలు, పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యమంత్రి అసమర్థత, ఆర్థిక, రాజకీయ విధానాల వల్ల పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. రహదారులు, ఇసుక, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక వనరులు అందుబాటులో లేకుండా పోయాయి’’ అని అన్నారు.


మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్‌గా మార్చారు. జూదం, మద్యం అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సాక్షాత్తూ వైసీపీ నాయకులే క్యాసినోను నడిపిస్తున్నారు. పన్నులు, ధరల పెంపుతో సామాన్యుడి బతుకు దుర్భరంగా మారింది. ముఖ్యమంత్రి పాలన చేతకాక చేతులెత్తేశారు. తన అసమర్థతకు, చేతగానితనానికి, వైఫల్యాలకు చంద్రబాబును బూచిగా చూపెడుతున్నారు. అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు చంద్రబాబు నాయుడును తిరిగి ముఖ్యమంత్రిని చేసేవరకు నిరంతరం కృషి చేయాలి’’ అని అన్నారు.


అనంతరం..  ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి, సంక్షోభంలో విద్యారంగం, వరద బాధితులను ఆదుకోవాలి, రహదారులు- నరక కూపాలు, రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలి, సభ్యత్వ నమోదు – పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి పలు తీర్మానాలను మన్నవ సుబ్బారావు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో వెంకట్ కోగంటి,  ప్రసాద్ మంగిన, సాయి నూతక్కి, మల్లిక్ వేదగిరి, రజని కాకరాల, చంద్ర గుంటుపల్లి, భరత్ ముప్పిరాల, లీయోన్ రెడ్డి, సుధీర్ ఉన్నం, శ్రీకాంత్ దొడ్డపనేని, శశి దొప్పలపూడి, లక్ష్మణ్ పర్చూరి, విజయకృష్ణ గుమ్మడి, శ్రీని వల్లూరిపల్లి, సతీష్ అంబటి, సతీష్ చిలుకూరి, జెట్టి వెంకయ్య, హేమారావు నందిపాటి, విజయ్ అసురి, శ్రీలు వెలిగేటి, శ్రీదేవి, భాస్కర్ వల్లభనేని, వీరు ఉప్పల, రాజా కొల్లి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-01T21:20:31+05:30 IST