ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల దాడులపై బ్లింకెన్‌తో దోవల్ చర్చ

ABN , First Publish Date - 2021-07-28T20:45:53+05:30 IST

భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల దాడులపై బ్లింకెన్‌తో దోవల్ చర్చ

న్యూఢిల్లీ : భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ బుధవారం చర్చలు జరిగాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల దాడులు, ఇండో-పసిఫిక్, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత పరిస్థితులపై వీరిరువురు మాట్లాడారు. 


ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని దోవల్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ చర్చల్లో దాదాపు ఓ గంటపాటు ప్రపంచంలో పెరుగుతున్న సంఘర్షణల పరిస్థితులపై మాట్లాడారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపైనా, దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్‌లలో చైనా దూకుడుపైనా  బ్లింకెన్ తన అభిప్రాయాలను అరమరికలు లేకుండా దోవల్‌తో పంచుకున్నారు. 


అజిత్ దోవల్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతంలో భద్రత, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల దాడులు, తూర్పు లడఖ్‌లో పరిస్థితులపై భారత దేశ వైఖరిని వివరించారు. తాలిబన్ల ఆగడాల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌ సుస్థిరతకు మార్గాలపై ఇరువురు చర్చించారు. 


అమెరికాలో అక్టోబరులో జరగబోయే క్వాడ్ సమావేశాలపై కూడా వీరిరువురు చర్చించారు. క్వాడ్ దేశాలైన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా అక్టోబరులో వాషింగ్టన్‌లో జరిగే సమావేశానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. అయితే జపాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశానికి హాజరవడంపై ఇంకా ధ్రువీకరించవలసి ఉంది.



Updated Date - 2021-07-28T20:45:53+05:30 IST