కన్నుల పండువగా నృసింహుడి కల్యాణం
ABN , First Publish Date - 2022-05-17T06:29:02+05:30 IST
కృష్ణా నదీ తీరంలో స్వయంభువుగా విరాజిల్లుతు న్న శ్రీ మట్టపల్లి లక్ష్మీనృసింహుని కల్యాణం సోమవారం తెల్లవారుజామున భక్తజన కోలాహలం మధ్య కన్నుల పండువగా నిర్వహించారు.
మఠంపల్లి, మే 16 : కృష్ణా నదీ తీరంలో స్వయంభువుగా విరాజిల్లుతు న్న శ్రీ మట్టపల్లి లక్ష్మీనృసింహుని కల్యాణం సోమవారం తెల్లవారుజామున భక్తజన కోలాహలం మధ్య కన్నుల పండువగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణతంతును వేదపండితు లు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు సాగిన ఎదుర్కోళ్ల ఊరేగింపు కార్యక్రమంతో కల్యాణోత్సవం ప్రారంభం కాగా వేదపండితులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు, పరాశరం వెంకటచార్యులు, నారాయణ హరికిరణాచార్యుల పర్యవేక్షణలో శ్రీభూదేవి,రాజ్యలక్ష్మీ అమ్మవార్ల సమేత శ్రీలక్ష్మీనరసింహుని కల్యాణం రమణీయంగా జరిపించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరాగా వేడుక తెల్లవారుజూమున రుత్వికులు, అర్చకుల సమక్షంలో కల్యాణోత్సవం ముగిసింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈవో సిరికొండనవీన్, బొమ్మరెడ్డి కోటిరెడ్డి, సర్పంచ్ దాసరి విజయలక్ష్మివెంకటరమణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. మట్టపల్లి నృసింహస్వామిని కోదాడ, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్కుమార్ దర్శించుకున్నారు. జడ్పీటీసీ జగన్నాయక్, ఎంపీపీ ముడావత్ పార్వతి, వైస్ఎంపీపీ రూపావత్ కవితాకృష్ణానాయక్, సర్పంచ్ దాసరివిజయలక్షీవెంకటరమణ, మాజీ ఎంపీపీలు కుమ్మరికుంట్ల లక్ష్మీవెంకటనారాయణ, ఎం.కొండానాయక్ స్వామివారిని దర్శించుకున్నారు. ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ప్రారంభించారు.
మజ్జిగ, తాగునీరు, అల్పహారాలను ఏర్పాటు చేసినట్లు సంస్థ నియోజకవర్గ ఇన్చార్జి కుక్కల వెంకన్న తెలిపారు. కల్యాణోత్సవానికి ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు మరో 120మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో కల్యాణం జరిగేలా సహకరించిన అందరికీ హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, మఠంపల్లి ఇరుగు రవి కృతజ్ఞతలు తెలిపారు