సౌదీలో గిరిజనుడి మృతి.. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ప్రవాసీయులు

ABN , First Publish Date - 2022-07-21T22:28:27+05:30 IST

ఆనారోగ్యంతో ఆసుపత్రి పాలయి చికిత్స పొందుతూ మరణించిన ఒక పేద గిరిజన ప్రవాసీయుడి విషాధ గాథ ఎట్టకేలకు ముగిసింది.

సౌదీలో గిరిజనుడి మృతి.. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ప్రవాసీయులు

కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా భారతీయం – అదే సహాయం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఆనారోగ్యంతో ఆసుపత్రి పాలయి చికిత్స పొందుతూ మరణించిన ఒక పేద గిరిజన ప్రవాసీయుడి విషాధ గాథ ఎట్టకేలకు ముగిసింది, కేరళ ప్రవాసీయులకు తోడుగా తెలుగు ప్రవాసీయులు కూడా మృతుడి కుటుంబానికి అండగా నిలబడడంతో మృతదేహాం స్వదేశానికి చేరుకోంది. అసహానం, ద్వేషంతో ప్రవాసీయులు నిలువునా చీలిపోతున్న నేటి తరుణంలో భారతీయత అనే ఒకే ఒక్క బంధంతో రాష్ట్రాలు, మతాలు, కులాలకు అతీతంగా అండగా నిలిచారు.


మహెబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలోని ముందలి గిరిజన తాండకు చెందిన నార్యా నాయక్ అనే పేద గిరిజనుడు సౌదీ అరేబియాలోని హాయిల్ అనే ప్రాంతంలో ప్రైవేటుగా పని చేస్తూ ఆనారోగ్యానికి గురయ్యాడు. అదే ప్రాంతంలో పని చేస్తున్న మహెబూబ్ నగర్ జిల్లాకు చెందిన గిరిజనులందరు కలిసి అతడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ జూన్ 3న మరణించాడు. ఆసుపత్రి బిల్లు చెల్లింపు సమస్య కావడంతో తోటి గిరిజనులందరు కలిసి విరాళాలు సేకరించి ఆసుపత్రి బిల్లు చెల్లించారు. 


ఇక మృతదేహాన్ని స్వదేశానికి తరలించడం కష్టంగా మారడంతో జి.డబ్ల్యూ.ఏ.సి నాయకులు అబ్దుల్ రఫీక్ చొరవ తీసుకోని కేరళకు చెందిన ప్రవాసీయుల దృష్టికు తీసుకోవచ్చారు. దీంతో అబ్దుల్ రహేమాన్ అనే ప్రముఖ మళయాలీ నాయకత్వంలో మలయాళీలందరు కలిసి మృతదేహాం తరలింపుకు అవసరమైన డబ్బును సమకూర్చారు. డబ్బు ఇవ్వడంతో పాటు రియాధ్ నగరం నుండి 600 కిలో మీటర్ల దూరంలో ఉన్న హయిల్ అనే వ్యవసాయిక నగరంలో అబ్దుల్ రహేమాన్ తన సహచర మలయాళీలతో తిరిగి వీసా ఎగ్జిట్ ప్రక్రియను పూర్తి చేసారు. ఇక నాయక్‌పై ఆధారపడ్డ భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని వారిని ఆదుకోవడానికి సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ (సాటా) అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన చిత్తులూరి రంజీత్ అధ్వర్యంలో రెండు లక్షల రూపాయాలు ఆర్ధిక సహాయం చేసింది. ఈ రకమైన సహాయక చర్యలలో తామెల్లప్పుడు ముందుంటామని సాటా అధ్యక్షుడు మల్లేషన్ పెర్కోన్నారు.

Updated Date - 2022-07-21T22:28:27+05:30 IST