కరోనాపై పోరుకు ఎన్నారైల భారీ ఆర్థిక సాయం !
ABN , First Publish Date - 2020-04-10T20:04:56+05:30 IST
ప్రపంచ దేశాలను కరోనా తీవ్ర సంక్షోభంలో నెట్టేసింది. అగ్రరాజ్యాలు సైతం ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి.
వాషింగ్టన్: ప్రపంచ దేశాలను కరోనా తీవ్ర సంక్షోభంలో నెట్టేసింది. అగ్రరాజ్యాలు సైతం ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. మానవ జాతికి సవాల్ విసురుతున్న 'కొవిడ్-19' వల్ల రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దేశ ప్రజలను ఆదుకోవడంతో పాటు, కరోనా ప్రభావం వల్ల అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు భారీ ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. ఇక మాతృదేశంలో ఈ మహమ్మారి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇతర దేశాల్లో స్థిరపడిన ప్రవాసులు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
తాజాగా ఈ మహమ్మారిపై పోరుకు అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు ఏకంగా 6 లక్షల డాలర్ల(రూ. 4,56,24,000) భారీ విరాళాలు సేకరించారు. 'చలోగివ్ ఫర్ కొవిడ్-19' పేరుతో ఈ నిధులను వారు సేకరించడం జరిగింది. వీటిని ఇండియా, యూఎస్లో కరోనా కారణంగా ప్రభావితమైన ప్రజలను ఆదుకునేందుకు వినియోగించనున్నారు. వీటిలో 5 లక్షల డాలర్లు అమెరికాలో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన భారత వ్యక్తులు అందించగా, మిలిగిన లక్ష డాలర్లను ఇతర ఎన్నారైలు ఇచ్చారు. ఈ భారీ నిధులను భారత్లో 'గూంజ్' స్వచ్ఛంద సంస్థ ద్వారా అవసరమైన వారికి చేరుస్తామని ఎన్నారైలు తెలిపారు.