ఎన్నారై మహిళకు చిన్ననాటి స్నేహితుడి వంచన.. నెట్టింట న్యూడ్ ఫొటోలు!
ABN , First Publish Date - 2021-03-23T16:10:11+05:30 IST
ఆమె వయసు 32 సంవత్సరాలు. పెళ్లయి భర్త, ఐదేళ్ల బాబు ఉన్నాడు. ఆస్ట్రేలియాలో స్థిర నివాసం.. చక్కగా సాగుతున్న సంసార నౌక.
చిన్ననాటి స్నేహితుడితో చనువు తెచ్చిన తంటా
నగ్న ఫొటోలు పంపకపోతే చస్తానని బెదిరింపులు
సామాజిక మాధ్యమాలలో ఆమె చిత్రాలు
భర్త, ఐదేళ్ల కొడుకుతో ఆమె ఆస్ట్రేలియాలో జీవనం
భారత్కు వెళ్లి ఫొటోలను తీయించేయమన్న భర్త
ఫొటోలు తీసేయాలంటూ సైట్లకు బాధితురాలి లేఖలు.. హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఆమె వయసు 32 సంవత్సరాలు. పెళ్లయి భర్త, ఐదేళ్ల బాబు ఉన్నాడు. ఆస్ట్రేలియాలో స్థిర నివాసం.. చక్కగా సాగుతున్న సంసార నౌక. అ పయనంలో ఓ కుదుపు. పదేళ్ల క్రితం.. పెళ్లికి ముందు చిన్నప్పటి స్నేహితుడితో చనువుగా ఉన్న ఫలితం ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది. న్యూడ్ ఫొటోలను పంపాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని అతడు బెదిరిస్తే భయపడిపోయి ఫొటోలు పంపిన ఆమెకు ఇప్పుడవే నరకప్రాయంగా తయారయ్యాయి. ఆ ఫొటోలను అతడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సామాజిక మాధ్యమాలు, పోర్న్సైట్లలో పెట్టాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలను చూసిన భర్త, భారత్కు వెళ్లి.. సైట్లలోంచి ఫొటోలను తొలగించుకొని రావాలంటూ చెప్పడంతో ఆమె స్వదేశానికి వచ్చింది. ఫొటోలను తొలగించాలంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్కు లేఖలు రాసింది. సరైన ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది.
స్నేహం ముసుగులో దుర్మార్గం!
మాదాపూర్లో నివాసం ఉంటున్న బాధితురాలి తల్లి, తన కూతురుకు ఎదురైన పరిస్థితిని వివరించారు. 2011లో బాధితురాలు, తన చిన్ననాటి స్నేహితుడితో చనువుగా ఉండేది. అతడితో సన్నిహితంగా ఉన్న రోజుల్లో నగ్న చిత్రాలను పంపాలని, లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆమెను అతడు బ్లాక్మెయిల్ చేశాడు. భయపడి షేర్ చేసిన ఫొటోలను అతడు సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది తెలిసి ఆమె కుటుంబసభ్యులు 2012లో ఫిర్యాదు చేయడంతో తొలగించారు. మళ్లీ 2019 నుంచి ఆ పొటోలు సామాజిక మాధ్యమాల్లో, ఫోర్న్సైట్లలో కనిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఫొటోలు చూసిన ఆమె భర్త, ఆ ఫొటోలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని తన కుమార్తెను హైదరాబాద్కు పంపినట్లు వెల్లడించారు.
హైకోర్టులో విచారణ
తప్పుడు అకౌంట్లతో సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తన ఫొటోలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును బాధితురాలు అభ్యర్థించింది. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. లక్ష్మణ్ విచారించారు. మహిళ నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టిన నిందితుడిని పట్టుకోడానికి, మహిళ ఫొటోలను సైట్లలోంచి తొలగించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని సైబర్ క్రైం పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ప్రశ్నించారు.అసభ్య చిత్రాలను తొలగించేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని గూగుల్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాలకు నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణను మార్చి 30కి వాయిదా వేశారు.