Amazon లో రూ. 70వేల ఐఫోన్ ఆర్డర్ చేసిన NRI.. ఇంటికొచ్చిన పార్శిల్ తెరిచి చూస్తే షాక్!
ABN , First Publish Date - 2021-10-22T23:59:12+05:30 IST
కేరళకు చెందిన ఓ ఎన్నారై ఈ నెల 12న ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్లో ఐఫోన్-12 ఆర్డర్ చేశాడు. దాని విలువ అక్షరాల రూ.70వేలు. ఇక ఆర్డర్ చేసిన కొత్త ఐఫోన్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాడు.
కొచ్చి: కేరళకు చెందిన ఓ ఎన్నారై ఈ నెల 12న ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్లో ఐఫోన్-12 ఆర్డర్ చేశాడు. దాని విలువ అక్షరాల రూ.70వేలు. ఇక ఆర్డర్ చేసిన కొత్త ఐఫోన్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాడు. మూడు రోజుల తర్వాత పార్శిల్ వచ్చింది. పార్శిల్ రాగానే ఎగిరి గంతేశాడు. కొత్త ఫోన్ చూద్దామని పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్. అందులో ఐఫోన్-12 బదులు ఒక వీంబార్తో పాటు ఐదు రూపాయల కాయిన్ కనిపించాయి. అంతే... ఐఫోన్ రావాల్సిన బాక్సులో సబ్బు, రూ.5 బిళ్లా కనిపించేసరికి ఆయనకు కొద్దిసేపు నోటమాట రాలేదు. అయితే పార్శిల్ను డెలవరీ బాయ్ ముందే ఓపెన్ చేయడంతో పాటు వీడియో కూడా రికార్డ్ చేశాడు. ఆ వీడియో సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని డబ్బులు వెనక్కి వచ్చేశాయి.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని అలువకు చెందిన నూరల్ అమీన్ అనే ఎన్నారై ఈ నెల 12న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా ఐఫోన్-12 ఆర్డర్ చేశాడు. దాని విలువ 70,900. అమెజాన్ పే కార్డు ద్వారా ఈ మొత్తాన్ని చెల్లించాడు. ఆర్డర్ చేసిన మూడు రోజుల తర్వాత నూరల్కు అమెజాన్ డెలివరీ బాయ్ పార్శిల్ తెచ్చి ఇచ్చాడు. దాంతో డెలవరీ బాయ్ ముందే ఆ పార్శిల్ను ఓపెన్ చేశాడు. తీరా పార్శిల్ తెరిచి చూస్తే అందులో ఒక వీంబార్, రూ.5 బిళ్లా కనిపించాయి. దాంతో షాకయ్యాడు. అయితే, అప్పటికే ఆన్లైన్ మోసాలపై అవగాహనతో ఉన్న నూరల్ పార్శిల్ను తెరిచే సమయంలో వీడియో రికార్డు చేశాడు. దాని సాయంతో సైబర్ క్రైమం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో అదే IMEI నెంబర్ గల ఫోన్ ఇప్పటికే జార్ఖండ్లో వినియోగంలో ఉన్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 25న దాన్ని విక్రయించినట్లు తేలింది. దాంతో పోలీసులు అమెజాన్ వాళ్లను కాంటాక్ట్ చేసి, నూరల్ డబ్బులను రీఫండ్ చేయించారు. ఇదే తరహాలో ఇటీవలే కేరళలో మరో సంఘటన చోటు చేసుకుంది. పరావుర్కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆన్లైన్లోనే రూ. 1,14,700 విలువైన ల్యాప్టాప్ ఆర్డర్ చేస్తే పాత వార్త పత్రికలతో కూడిన పార్శిల్ వచ్చింది.