ఇండియాకు వచ్చిన NRI.. తిరిగి వెళ్లేటప్పుడు ఊహించని షాకిచ్చిన భార్య..!
ABN , First Publish Date - 2022-01-08T22:44:31+05:30 IST
అమెరికాలోని డల్లాస్ నగరంలో నివసించే ఎన్నారై ఒకరు ఇటీవల గుజరాత్ హైకోర్టులో హెబియన్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. భార్య తనకు చెప్పకుండానే తీసుకెళ్లిపోయిన కూతురిని తిరిగి తనకు అప్పగించాలని వేడుకున్నారు. తన కూతురిని తీసుకుని అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తన భార్య కూతురిని తీసుకుని వెళ్లిపోయిందని వాపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని డల్లాస్ నగరంలో నివసించే ఎన్నారై ఒకరు ఇటీవల గుజరాత్ హైకోర్టులో హెబియన్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. భార్య తనకు చెప్పకుండానే తీసుకెళ్లిపోయిన కూతురిని తిరిగి తనకు అప్పగించాలని వేడుకున్నారు. తన కూతురిని తీసుకుని అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తన భార్య కూతురిని తీసుకుని వెళ్లిపోయిందని వాపోయారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..
తమిళనాడుకు చెందిన ఓ ఎన్నారై ఐటీ ప్రొఫెషనల్. అమెరికా మిలిటరీకి సంబంధించిన ప్రాజెక్టులో సేవలందిస్తున్నారు. కాగా.. 2008లో గుజరాత్కు చెందిన ఓ యువతితో ఆయనకు వివాహం జరిగింది. ఆ జంటకు 2016లో ఓ బిడ్డ కలిగింది. అయితే..భార్యకు మానసిక సమస్యలు ఉన్నకారణంగా బిడ్డ కస్టడీ తనకే ఇవ్వాలని ఆయన అమెరికా న్యాయస్థానంలో కేసు వేయగా.. తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. ఆ తరువాత.. గుజరాత్లో ఉంటున్న భార్య తండ్రి అనారోగ్యం పాలవడంతో ఎన్నారై కుటుంబం భారత్కు వచ్చింది.
గతేడాది ఆగస్టు 30న తిరిగి వెళ్లేందుకు వారు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే.. విమానం ఎక్కాల్సిన రోజున భార్య కనిపించకుండా పోయిందని ఆయన తన పిటిషన్లో తెలిపారు. కూతురుని కూడా తనతో పాటూ తీసుకుని వెళ్లిపోయిందని చెప్పారు. తన పాస్పోర్టు కూడా కనిపించట్లేదని కోర్టుకు నివేదించిన ఆయన..తనకు న్యాయం చేయాలంటూ న్యాయస్థానాన్ని వేడుకున్నారు. కాగా.. ఈ విషయమై ఫిబ్రవరి 1లోపు స్పందించాలంటూ గుజరాత్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చిన్నారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.