USలో ఎన్నారై హత్య.. కూతురు పుట్టినరోజున దారుణం!

ABN , First Publish Date - 2021-12-07T23:37:28+05:30 IST

అమెరికాలోని ఓ ఎన్నారై దారుణ హత్యకు గురయ్యారు. జార్జియా రాష్ట్రంలోని ఈస్ట్ కొలంబస్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో అమిత్ కుమార్ పటేల్..

USలో ఎన్నారై హత్య.. కూతురు పుట్టినరోజున దారుణం!

అట్లాంటా(జార్జియా): అమెరికాలోని ఓ ఎన్నారై దారుణ హత్యకు గురయ్యారు. జార్జియా రాష్ట్రంలోని ఈస్ట్ కొలంబస్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో అమిత్ కుమార్ పటేల్(45).. సినోవస్ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అమిత్‌పై కాల్పులు జరిపి, ఆయన వద్దనున్న డబ్బును దోచుకుపోయాడని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. అమిత్ బ్యాంకులో అడుగుపెడుతుండగానే ఈ దారుణం జరిగింది. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అమిత్ కుమార్తె పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న రోజునే ఈ దారుణం జరగడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 


అమిత్ కుమార్‌ తన వ్యాపార భాగస్వామి విన్నీ పటేల్‌తో కలిసి స్టీమ్ మిల్ రోడ్డులో ఓ పెట్రోల్ బంక్ నిర్వహించే వారు. అమిత్ చాలా మంచి వ్యక్తి అని విన్నీ పేర్కొన్నారు. వారాంతంలో జరిగిన లావాదేవీల తాలుకు డబ్బును బ్యాంకులో జమ చేసేందుకు అమిత్ వెళ్లినప్పుడు ఈ దారుణం జరిగిపోయిందని చెప్పారు. నిందితుడు అమిత్‌ను ముందునుంచే టార్గెట్ చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు ఉన్న భవనంలోనే ఓ పోలీస్ ష్టేషన్ ఉండగా.. దాని ఎంట్రీ గేటుకు కొద్ది అడుగుల దూరంలోనే ఈ ఘటన జరిగింది. అమిత్‌కు భార్య ఓ కూతురు ఉన్నారు. కాగా.. నెల రోజుల వ్యవధిలో అమెరికాలో ఇటువంటి ఘటన జరగడం ఇది రెండోసారి. నవంబర్ 17న కేరళకు చెందిన సాజన్ మ్యాథ్యూ టెక్సాస్‌ రాష్ట్రంలో హత్యకు గురయ్యారు. ఆయన నిర్వహిస్తున్న షాపులో దోపిడీకి తెగబడ్డ దుండగుడు సాజన్‌పై కాల్పులు జరిపి హత్య చేశాడు.  

Updated Date - 2021-12-07T23:37:28+05:30 IST