ఎన్నారై కుటుంబం అనుమానాస్పద మృతి!
ABN , First Publish Date - 2021-04-15T15:49:49+05:30 IST
విశాఖ నగరంలో ఎన్నారై కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
విశాఖపట్నం: విశాఖ నగరంలో ఎన్నారై కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకెళితే.. బుధవారం అర్ధరాత్రి మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఆదిత్య టవర్స్లోని ఎన్నారై ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ధాటికి నలుగురు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే.. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని తెలుస్తోంది.
అన్నీ అనుమానాలే..!
కాగా.. మిథిలాపురి కాలనీ, అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులో 8 నెలల నుంచి ఎన్నారై కుటుంబం నివసిస్తున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, దీపక్ (22), కశ్యప్(19)గా పోలీసులు నిర్ధారించారు. అయితే.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురి మృతికి కారణం పాత కక్షలేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
ఘటనాస్థలంలో రక్తపు మరకలు..!
ఘటనాస్థలంలో రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమనీ తెలుస్తోంది. అప్పలరాజు అనే వ్యక్తిపై అనుమానంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఘటనపై డీసీపీ సురేష్ బాబు, ఏసీపీ శ్రీపాదరావు ఆరా తీస్తున్నారు.